శ్రీ రాముడు కుంభకర్ణుడుని సంహరించుట

సుగ్రీవుడు కుంభకర్ణుడి చెవులూ, చెక్కిళ్ళూ కొరికి ఒక్క గంతుతో రాముడి వద్దకు వెళ్ళి పోయాక కుంభకర్ణుడు దేహమంతా రక్త ధారలు కారుతూ, ఒక్క క్షణం పాటు కొండ లాగా నిలబడి పోయి, తిరిగి యుద్ధ భూమికే బయలుదేరాడు. తన చేతిలో ఆయుధం లేదని జ్ఞాపకం వచ్చి అతనొక భయంకరమైన ముద్గరాన్ని దారి లోనే ఎత్తుకుని యుద్ధరంగానికి వెళ్ళాడు. అక్కడ తన కోపావేశంతో కనిపించిన ప్రాణులన్నిటినీ పట్టుకుని తినసాగాడు. వారిలో వానరులతోబాటు రాక్షసులు కూడా తన నోట పడుతున్న సంగతి కూడా కుంభ కర్ణుడు గమనించలేదు. వానరులు అతనికి అందకుండా పారి పోతుంటే కుంభకర్ణుడు వారిని వెన్నంటి తరిమి పట్టుకుని ‘వేల సంఖ్యలో తినేశాడు.

ఇది చూసి లక్ష్మణుడు కుంభకర్ణుణ్ణి ఎదిరించి, అతని పై బాణాలు వేశాడు. కాని బాణాలను కుంభకర్ణు డే మాత్రమూ లక్ష్య పెట్టలేదు. అతను అందిన వానరు లను పట్టుకుని తింటూ రాముడి కేసి పోసాగాడు. రాముడొక భయంకరమైన అస్త్రాన్ని వేసి కుంభకర్ణుడి రొమ్ములో కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడి నోట జ్వాలలు వెలువడ్డాయి. అతను పడిపోయాడు.

కుంభకర్ణుడు మళ్ళీ లేవకుండా అతనిపై ఎక్కినుంచోమని లక్ష్మణుడు వాన రులతో చెప్పాడు. అయితే కుంభకర్ణుడు తన పైకి ఎక్కిన వానరులను చీమలను దులిపినట్టు దులిపేశాడు. అది చూసి రాముడు కుంభకర్ణుణ్ణి సమీపించి తన వింటి నారిని మోగించాడు.. కుంభకర్ణుడు లేచి నిలబడి పెద్ద పర్వతంలాగా రాముడికెదురు వచ్చాడు.

రాముడతన్ని చూసి, ” “కుంభకర్ణా భయపడకు! రా! ఇంద్రుణ్ణి జయించావు కాబోలు. నేను ఇంద్రుణ్ణి కాదు, రాముణ్ణి! నిన్నిప్పుడే ఒక్క క్షణంలో చంపబోతున్నాను,” అన్నాడు.

“నేను కూడా విరాధుణ్ణి కాను, కబంధుణ్ణి, ఖరుణ్ణి, వాలినీ, మారీచుణ్ణి కూడా కాను, కుంభకర్ణుణ్ణి! వచ్చాను! నీ ప్రతాప మేమిటో నాకు చూపించు, ఆ తరవాత నిన్ను తినేస్తాను,” అన్నాడు కుంభకర్ణుడు. రాముడు వేసిన మామూలు బాణాలు కుంభకర్ణుణ్ణి ఏమీ చెయ్యలేక పోయాయి : సాలవృక్షాలను ఛేదించి, వాలిని చంపిన బాణాలు కూడా కుంభకర్ణుడి పైన వ్యర్థమై పోయాయి. చేతిలో ఉన్న ముద్గరాన్ని గుండ్రగా తిప్పుతూ రాముడి బాణాలలో కొన్ని తనకు తగలకుండా చేసుకున్నాడు కుంభకర్ణుడు.

అప్పుడు రాముడు కుంభకర్ణుడి పైన వాయువ్యాస్త్రం ప్రయోగించాడు. అది ముద్గరం పట్టి ఉన్న కుంభకర్ణుడి చేతిని ఖండించేసింది. కుంభకర్ణుడు పెద్దగా అరిచాడు. అతడి చెయ్యి తెగినప్పుడు దాని కింద పడి కొందరు వానరులు నలిగి చచ్చారు.

కుంభకర్ణుడు ఒక చెయ్యి పోగొట్టుకుని, రెండో చేత్తో ఒక మహా వృక్షాన్ని పెరికి రాముడి పైకి వచ్చాడు. రాముడు జంద్రాస్త్రంతో కుంభకర్ణుడి రెండో చేతిని కూడా, చెట్టుతో సహా, నరికేశాడు. తరువాత అతను రెండు అర్ధచంద్ర బాణాలతో కుంభకర్ణుడి పాదాలు నరికేశాడు. కుంభకర్ణుడు పర్వతం లాగా విరుచుకు పడిపోయి, గుహలాటి నోరు తెరిచి గర్జిస్తుంటే, రాముడా నోటి నిండా బాణాలు కొట్టాడు. కుంభకర్ణుడు మూర్ఛ పోయి ఉన్న స్థితిలో రాముడొక దివ్యాస్త్రంతో కుంభకర్ణుడి తల నరికేశాడు.

మహా బలశాలి అయిన కుంభకర్ణుడు చావటంతో రాక్షసులు హాహాకారాలు చేశారు. వానరుల ముఖాలు వికసించాయి. కుంభకర్ణుడు రాముడి చేత చచ్చాడన్న వార్త వింటూనే రావణుడు కొంచెం సేపు మూర్ఛ పోయి తరువాత తమ్ముడి కోసం దుఃఖించాడు. అతనితో బాటు మిగిలిన రాక్షస వీరులు కూడా దుఃఖించారు.

తమ్ముడి కోసం దుఃఖిస్తున్న రావణుణ్ణి ఓదార్చి, త్రిశిరుడూ, అతికాయుడూ, దేవాం తకుడూ, నరాంతకుడూ, మహోదరుడూ, మహాపార్శ్వుడూ అనే ఆరుగురు రాక్షస యోధులు యుద్ధానికి బయలుదేరారు.

తిరిగి రాక్షస వానర సేనల మధ్య దొమ్మి యుద్ధం ఆరంభ మయింది. నరాంతకుడు వానరసేన మధ్యకు జొరబడి, తన ఈటెతో వానరులను వందల సంఖ్యలో చంప సాగాడు. అప్పుడు సుగ్రీవుడు అంగదుణ్ణి అతని పైకి పంపాడు.

అంగదుడు నరాంతకుడికి ఎదురు వెళ్ళి,”ఆ ఈటెను సాధారణ వానరుల పైన ఎందుకు ప్రయోగిస్తావు? దానితో నన్ను కొట్టు,” అన్నాడు. నరాంతకుడు తన ఈకను బలంగా అంగదుడి రొమ్ము మీద కొట్టాడు. అది కాస్తా విరిగి పడిపోయింది. అంగదుడు నరాంతకు డెక్కి ఉన్న గుర్రాన్ని నెత్తి మీద అరచేత్తో చరిచే సరికి అది తల పగిలి చచ్చిపోయింది. నరాం తకుడు తన పిడికిలి బిగించి గట్టిగా మొట్ట సరికి అంగదుడి తల పగిలి రక్తం కార సాగింది. “వీడి కొంత బలం ఉందా ?” అని ఆశ్చర్యపడి అంగదుడు తన పిడికిలి బిగించి నరాంతకుడి రొమ్ములో గట్టిగా పొడిచే సరికి నరాంతకుడు నెత్తురు కక్కుకుని చచ్చాడు.

అది చూసి మహోదరుడూ, దేవాం తకుడూ, త్రిశిరుడూ అంగదుడి పైకి వచ్చారు. ఆ ఒంటరిగా పోరాడుతున్న అంగదుడికి హనుమంతుడూ, నీలుడూ తోడు వచ్చారు. వారి మధ్య జరిగిన యుద్ధంలో హనుమంతుడు దేవాంతకుణ్ణి తల పగల గొట్టి చంపేశాడు. అలాగే నీలుడి చేతిలో మహోదరుడు చచ్చాడు. మళ్ళీ హనుమంతుడే త్రిశిరుడితో చాలా సేపు యుద్ధం చేసి అతని కత్తితోనే అతని కంఠం నరికేశాడు.

ఈ లోపల రాక్షస వీరులలో ఒకడైన మహాపార్శ్వుడు భయంకరమైన గధ ఒకటి తీసుకుని వాసరుల పైకి పోయేసరికి, ఋషభుడనే వాసరవీరుడు అతనితో తల పడి, అతని గద చేత కొట్టబడి కూడా, ఆ గదతోనే మహాపార్శ్వుడి తల పగల గొట్టేశాడు. మహాపార్శ్వుడు కూడా చాపగానే రాక్షసులు ఆయుధాలు పారేసి పారిపోయారు.

అలా పారిపోయే రాక్షసులను చూచి, అతికాయుడు చాలా కోపంచెంది, రెండో కుంభకర్ణుడి లాగా వానర సేన పై పడ్డాడు. రాముడు అతికాయుణ్ణి దూరానే చూసి ఆశ్చర్యపడి, “పర్వతాకారుడుగా వచ్చే ఈ వీరు డెవరు? ఇతని ధనుస్సులు కూడా అసాధారణంగానే ఉన్నాయి,” అని విభీషబుణి అడిగాడు.

“అతను రావణుడికి ధాన్యమాలిని యందు పుట్టిన కొడుకు, అతికాయుడు. లంకకు ఇతను కూడా పెట్టనికోట లాటివాడే. బ్రహ్మనారాధించి దివ్యాస్త్రాలు పొందిన వాడు. ఇతని సంగతి వెంటనే తేల్చకపోతే వానరసేనను బాణాలతో నాశనం చేయగలడు,” అని విభీషణుడు చెప్పాడు. ఈ లోపల అతికాయుడు సింహనాదం చేస్తూ వానర సేనలో ప్రవేశించాడు. కుముదుడూ, ద్వివిదుడూ, మైందుడూ, నీలుడూ, శరభుడూ ఏకమై అతన్నెదిరించారు.

అతను వారందరినీ ఉక్కుబాణాలతో కొట్టి బాధించాడు. తరువాత అతను రాముడున్న చోటికి వచ్చి, ” నేను అల్పులతో యుద్ధం చెయ్యను. సమర్థు డెవడన్నా ఉంటే నాతో యుద్ధానికి రావచ్చు,” అన్నాడు.

ఆ మాట విని లక్ష్మణుడు రోషంతో అతని ముందుకు వచ్చి తన వింటినారిని మోగించి సవాలు చేశాడు.

“లక్ష్మణా, నీవు అర్చకుడివి, నాతో యుద్ధం చేసి, నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోకు,” అన్నాడు అతికాయుడు.

“నీ ప్రతాపం ఉత్తమాటలలో గాక, చేతలలో చూపించు,” అన్నాడు లక్ష్మణుడు.

ఇద్దరూ బాణాలతో యుద్ధం ప్రారంభిం చారు. ఒకరినొకరు బాణాలతో నొప్పించారు. ఒకరి బాణాల నొకరు పడగొట్టారు. ఒకరు వేసే అస్త్రాలను మరొకరు ప్రతి అస్త్రాలతో ప్రతిఘటించారు. అతికాయుడు అభేద్యమైన కవచం ధరించి ఉండటంచేత లక్ష్మణుడి బాణాలు అతన్ని ఏమీ చెయ్య లేకపొయాయి. ఈ సంగతి గ్రహించి, లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి అతి కాయుడి తల నరికేశాడు

ఆరుగురు మహాయోధులైన రాక్షస వీరులూ చచ్చారని వినగానే రావణుడు అంతులేని దుఃఖసముద్రంలో ముణిగిపోయాడు. అప్పుడు ఇంద్రజిత్తు తన తండ్రిని చూసి, ” ఇంద్రజిత్తు బతికి ఉండగానే ఈ విచారం దేనికి ? నే నిప్పుడే వెళ్ళి ఆ రామలక్ష్మణులను యుద్ధంలో చంపి తిరిగి వస్తాను,” అన్నాడు. రావణుడు “సరేనన్నాడు.

ఇంద్రజిత్తు ఉత్తమమైన గాడిదలు కట్టిన రథం పైన ఎక్కి, యుద్ధభూమికి బయలు దేరాడు. ధనుర్ధరులైన రాక్షసవీరులనేకులు ఏనుగుల పైనా, గుర్రాల పైనా ఎక్కి, ప్రాసాలూ, ముద్గరాలూ, ఖడ్గాలూ, గదలూ తీసుకుని ఇంద్రజిత్తు వెంట యుద్ధానికి బయలుదేరారు..

యుద్ధభూమిలో, తన రథం చుట్టూ రాక్షసులను కాపలా ఉంచి, ఇంద్రజిత్తు హవిస్సులను హెూమం చేసి, నల్లమేకను బలి ఇచ్చాడు. అగ్ని పొగలేకుండా మండి అతనికి విజయాన్ని సూచించింది. తరవాత ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం జపించి, దానితో తన ధనుస్సునూ, రథాన్నీ అభిమంత్రించాడు. ఇదంతా పూర్తి అయాక ఇంద్రజిత్తు తన రథంతోనూ, సారధితోనూ సహా ఆకాశం లోకి వెళ్ళి అంతర్ధానమైపోయాడు. రాక్షస సేన అమితోత్సాహంతో యుద్ధానికి కదిలింది.

వానరసేనపై దారుణమైన హత్యాకాండ సాగింది. ప్రముఖ వానరవీరులైన గంధ మాదనుడూ, నలుడూ, మైందుడూ, గజుడు, జాంబవంతుడూ, సుగ్రీవుడూ, ఋషభుడూ, అంగదుడూ, ద్వివిదుడూ ఇంద్రజిత్తు ప్రయోగించిన తీవ్రమైన బాణాలతో గాయపడ్డారు; కొందరు మూర్ఛ పోయారు. ఇంక చచ్చిన వానరులకు లెక్కే లేదు. ఇంద్రజిత్తు ఆకాశంలో ఎక్కడ ఉన్నదీ వానరులకు కనిపించనైనా లేదు.

ఇంద్రజిత్తు కురిపించే బాణవర్షం రామ లక్ష్మణుల పైన కూడా పడింది. రాముడు లక్ష్మణుడితో, “కంటికైనా కనిపించని ఈ ఇంద్రజిత్తుతో యుద్ధం చెయ్యటం మనకు సాధ్యమయే పని కాదు. అతని అస్త్రాల ఫలితంగా వానరసేన అంతా మూర్ఛపడి ఉన్నది. మనం కూడా మూర్ఛ వచ్చినట్టు పడిపోతే ఇంద్రజిత్తు తృప్తిపడి వెళ్ళిపోతాడు,” అన్నాడు.

రామలక్ష్మణులు కూడా మూర్ఛితులై పడినట్టు కనిపించగానే ఇంద్రజిత్తు పరమ సంతోషంతో లంకకు తిరిగి వెళ్ళాడు. రామ లక్ష్మణులు మూర్ఛలో ఉండటం చూసి వానరసేన కలవరం చెందింది. సుగ్రీవుడూ, నీలుడూ, అంగదుడూ, జాంబవంతుడూ నిజంగానే ఒళ్ళు తెలియని మూర్ఛలో ఉన్నారు.

రామలక్ష్మణులను చూసి కంగారుపడే వానరులతో విభీషణుడు, “మీరు కంగారు. పడకండి. రామలక్ష్మణులు మూర్ఛ నటిస్తు న్నారు. అంతే!” అన్నాడు.

రాత్రి, చీకటి. మూర్ఛపడి ఉన్న వాన రులలో ప్రాణాలతో ఉన్నవారెవరో, చచ్చిన వారెవరో తెలియటం లేదు. అందుచేత హనుమంతుడూ, విభీషణుడూ చెరొక కొరవి తీసుకుని వెదక నారంభించారు. ఇంద్రజిత్తు ఆ సాయంకాలం అయిదు గడియల కాలంలో అరవైఏడు కోట్ల వానరులను పడగొట్టాడు. పడిపోయిన వారిలో సుగ్రీవుడూ, అంగదుడూ, నీలుడు శరభుడూ మొదలైన వారెందరో వారికి కనిపించారు. వారు జాంబవంతుడి కోసం వెతికారు. మహా వృద్ధుడైన జాంబవంతుడు స్పృహతోనే కనిపించాడు.

విభీషణుడు జాంబవంతుణ్ణి సమీపించి, “తాతా, ప్రాణాలతో ఉన్నావు గద!” అన్నాడు.

జాంబవంతుడు హీనస్వరంతో, ” ఆ మాట్లాడేది విభీషణుడా, నాయనా? నాకు కళ్ళు కనిపించటం లేదు. హనుమంతుడు బాగా ఉన్నాడా ?” అని అడిగాడు.

“తాతా, సుగ్రీవుణ్ణి, అంగదుణ్ణి, రామ లక్ష్మణులను గురించి అడగకుండా హనుమంతుడి మాట అడుగుతున్నావేం?” అని విభీషణు డన్నాడు.

“హనుమంతుడి మాట ఎందుకడిగా నంటావా? చెబుతా విను. హనుమంతు డొక్కడే ఉండి ఈ వానరసేన అంతా చచ్చినా అది బతికి ఉన్నట్టే. అలా కాక హనుమంతుడు పోయి వానరసేన అంతా బతికి ఉన్నప్పటికీ అది చచ్చిన దానితో సమానమే. నాయనా, ఆ హనుమంతుడు బ్రతికి ఉన్నంతకాలమే మాకు జీవితం పైన ఆశ!” అన్నాడు జాంబవంతుడు.

ఈ మాటలు వింటున్న హనుమంతుడు ఎంతో గౌరవభావంతో జాంబవంతుణ్ణి సమీపించి, అతని కాళ్ళు పట్టుకుని సమస్కారం చేశాడు.

హనుమంతుడి కంఠం వినిపించగానే జాంబవంతుడికి ప్రాణం లేచి వచ్చింది.

“నాయనా, హనుమంతుడా! ఇలారా ఈ వానరులను కాపాడే భారం ఇప్పుడు నీదే. ఈ పని నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు. నీవు సముద్రం దాటి హిమవత్పర్వ తానికి వెళ్ళాలి. అక్కడ అన్నిటి కన్న ఎత్తుగా కనిపించే శిఖరాలు ఋషభమూ, కైలాసమూనూ. ఆ రెంటికీ నడుమగా ఓషధీ పర్వతం ఉన్నది. దాని శిఖరం మీద కాంతి వంతమైన దివ్యౌషధులు నాలుగున్నాయి. వాటి పేరు విశల్యకరణి, మృతసంజీవినీ, సౌవర్ణకరణి, సంధానకరణి. ఆ నాలుగు ఓషధులనూ తీసుకుని శీఘ్రంగా తిరిగిరా!” అని జాంబవంతుడు హనుమంతుణ్ణి హెచ్చ రించాడు. వాటితో వానరులను బ్రతికించ పచ్చునని ఆయన అన్నాడు.

వెంటనే హనుమంతుడా రాత్రివేళ ఒక్క దూకున పర్వత శిఖరం మీదికి ఎక్కి శరీరం పెంచి, రాక్షసులు అడలుకునేటట్టుగా పెడబొబ్బ పెట్టి ఆకాశంలోకి లేచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *