రావణుడు కుంభకర్ణుడిని నిద్ర లేపుట

అకంపనుడు చచ్చిన వార్త విని రావణుడికి కోపం వచ్చింది. అతను సభ నుంచి బయలుదేరి, తన వ్యూహాలను చూసుకుంటూ ఒక సారి లంక అంతా తిరిగి వచ్చాడు. అతను లంక చుట్టూ ఉన్న వానరుల ముట్టడి కూడా చూశాడు, సభకు తిరిగి వచ్చి, ప్రహస్తుణ్ణి చూసి, “వానరుల ముట్టడిని విచ్ఛిన్నం చెయ్యటం ఇతరుల వల్లకాదు, దానికి నేనూ, నీవూ, కుంభ కర్ణుడూ, ఇంద్రజిత్తూ, నికుంభుడూ మాత్రమే సమర్థులం. నీవు సేనతో వెళ్ళి, వానరులను జయించి రా,” అన్నాడు.

సీతను రాముడి కిచ్చేసి సంధి చేసుకోవటమే మంచిదనుకున్న వారిలో ప్రహస్తుడు కూడా ఉన్నాడు. సంధి జరగలేదు. అందుచేత తప్పనిసరిగా యుద్ధం సంప్రాప్తమయింది. యుద్ధం వస్తే రావణుడి కోసం ప్రాణాలు విడవటానికైనా ప్రహస్తుడు సిద్ధమే. అతను రథమెక్కి, యుద్ధానికి బయలుదేరాడు.

ఆర్భాటంగా వస్తున్న ప్రహస్తుణ్ణి చూసి రాముడు, “ఆ వచ్చేదెవరు? చాలా పరాక్రమ వంతుడిలాగా కనిపిస్తాడు!”. అన్నాడు విభీషణుడితో.

“అతను ప్రహస్తుడు. అస్త్రాలెరిగిన శూరుడు. రావణుడి సేనలో మూడోవంతు అతని అధీనంలో ఉంటుంది,” అని విభీషణుడు చెప్పాడు.

ఈ లోపల వానరవీరులు ప్రహస్తుణ్ణి చూసి సింహనాదాలు చేశారు. వాళ్ళు చెట్లూ, రాళ్ళూ పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. యుద్ధంలో ఉభయ పక్షాలకూ ప్రాణ నష్టం జరిగింది. నరాంతకుడూ, కుంభహనుడూ, మహానాదుడూ, సమున్నతుడూ అనే రాక్షస యోధులు అంతులేని వానరులను చంపి, ద్వివిదుడూ, దుర్ముఖుడూ, జాంబవంతుడూ, తారుడూ అనే వానర వీరుల చేతుల్లో చచ్చారు. నీలుడు ప్రహస్తుణ్ణి ఎదుర్కొని, భయం కరంగా పోరాడి, తీవ్రంగా గాయపడి, చివరకు ప్రహస్తుడి తల చితకగొట్టి చంపే శాడు. ప్రహస్తుడు పోవటంతో, చావగా మిగిలిన రాక్షసులు భయకంపితులై లంక లోక్ పారి పోయారు. నీలుణ్ణి రామ లక్ష్మణులూ, సుగ్రీవుడూ, ఇతరులూ ఎంతో మెచ్చుకున్నారు.

ప్రహస్తుడి మరణ వార్త విని రావణుడికి కసి, దుఃఖమూ కూడా కలిగాయి. అతను తనను పరివేష్టించి ఉన్న రాక్షసవీరులతో, “దేవతలను జయించగల ప్రహస్తుణ్ణి చంపారంటే వానరులు సామాన్యులుకారు. ఇంక నేను పేక్షించటానికి లేదు. నేనే స్వయంగా యుద్ధానికి పోతాను, నా బాణాలతో ఆ శ్రీరామలక్ష్మణులనూ, వానరసేననూ దగ్ధం చేస్తాను.” అన్నాడు.

రావణుడు తన రథ మెక్కి, సేనను వెంట బెట్టుకుని వానరుల పై యుద్ధం చెయ్యటానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ సేనలో రావణుడి కొడుకులైన అకంపనుడనే వాడూ, ఇంద్రజిత్తూ ఉన్నారు.

విభీషణుడు రాముడికి వారందరినీ గురించి వేరు వేరుగా చెప్పాడు. రాముడు రావణుడి తేజస్సునూ, అతని యోధులు పట్టిన ఆయుధాలనూ చూసి ఆశ్చర్య చకితుడయాడు.

రావణుడు తన వెంట వచ్చిన రాక్షస వీరులతో, “మీరు తిరిగి వెళ్ళి లంకా నగరాన్ని కాపాడండి, లేకపోతే నిర్జనమైన లంకను శత్రువులు తేలికగా ఆక్రమించుకో గలరు,” అని చెప్పాడు.

రావణుడు యుద్ధానికి వస్తుండగానే సుగ్రీవుడతన్ని ప్రతిఘటించాడు. రావణుడు వేసిన బాణాలకు సుగ్రీవుడు త్వరలోనే తెలివి తప్పి పడి పోయాడు.

వానరసేనను కాపాడే భారం రాముడి పైన పడింది. అతను విల్లు పట్టి రావణుడితో తలపడటానికి ఉద్యుక్తుడౌతుండగా, లక్ష్మణుడు రాముడితో, ” వీన్ని చంపటానికి నీవు కావాలా? నన్ను పోనీ!” అన్నాడు.

“వెళ్ళు. యుద్ధం జాగ్రత్తగా చెయ్యి,” అన్నాడు రాముడు. ఎందుకంటే రావణుడు. మహా యోధుడు.

లక్ష్మణుడు రావణుడి పైకి వచ్చేలోపల హనుమంతుడు రావణుడి రథం పక్కన చేరి, కుడి చెయ్యి ఎత్తి, ” నిన్నిప్పుడొక్క గుద్దుతో చంపబోతున్నాను,” అన్నాడు.

“నన్ను తప్పకుండా కొట్టు. ఒక కోతి రావణుణ్ణి కొట్టింది అన్న ఖ్యాతి కలకాలం ఉండిపోతుంది. నీవు నన్ను కొట్టిన మరు క్షణం నీ ప్రాణాలు తీస్తాను.” అన్నాడు. రావణుడు.

“నా చేతి దెబ్బకు నీ కొడుకు అక్షుడు చచ్చిన సంగతి మరిచిపోకు,” అన్నాడు

హనుమంతుడు. ఈ మాట విని రావణుడు హనుమంతుడి రొమ్ముమీద అరచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు హనుమంతుడు క్షణంపాటు దిమ్మరపోయి, రావణుడి రొమ్ము మీద తన అరచేత్తో ఒక్క చరుపు చరిచాడు. ఆ దెబ్బకు రావణుడదిరి పోయాడు. రావణుడు కాస్త పుంజుకుని, “భేష్! పగవాడి వైతేనేం? నీ బలం చాలా గొప్పది!” అన్నాడు.

“నా బలం తగలబెట్టనా? నా చేత దెబ్బ తిని కూడా నీ వింకా బతికే ఉంటివి! ” మళ్ళీ ఒకసారి దెబ్బ కొట్టు, నా పిడికిలి పోటుతో నిన్ను యముడి దగ్గిరికి పంపేస్తాను,” అన్నాడు హనుమంతుడు. రావణుడు మండిపడి, తన పిడికిలితో హనుమంతుడి రొమ్ములో భయంకరంగా పొడిచి, హనుమంతుడు తెప్పిరిల్లే లోపుగా నీలుడితో యుద్ధానికి వెళ్ళాడు. నీలుడితో యుద్ధం చేస్తున్న రావణుడితో హనుమంతుడు, “మరొకరితో పోట్లాడే వాడి పైకి పోవటం యుక్తం కాదు గనక నిన్నీసారికి పోనిచ్చాను,” అన్నాడు.

నీలుడు రావణుడితో అతి విచిత్రమైన యుద్ధం చేశాడు. అతను అతి చిన్న దేహం ధరించి రావణుడి టెక్కెం పైన వాలాడు.అతనికి బాణం గురిచేసి కొట్టటం రావణుడికి అసాధ్యమయింది. నీలుణ్ణి చూసి రామ లక్ష్మణ హనుమంతు లాశ్చర్యపడ్డారు. చివరకు రావణుడు నీలుణ్ణి ఆగ్నే యాస్త్రంతో పడగొట్టాడు. అయితే, అగ్ని దేవుడు నీలుడికి తండ్రే గనక ఆగ్నే యాస్త్రం అతన్ని నేలపై పడగొట్టిందే గాని, అతని ప్రాణాలు తియ్యలేదు.

అప్పుడు లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించాడు. ఇద్దరికి జరిగిన యుద్ధంలో ఒకరి నొకరు మూర్ఛ పోగొట్టుకున్నారు. చివరకు రావణుడు లక్ష్మణుడి పైన ఒక శక్తిని ప్రయోగించాడు, అది అతనికి బ్రహ్మ ఇచ్చినది. అది రొమ్ములో తగిలే సరికి లక్ష్మ ణుడు మూర్ఛపోయాడు. అప్పుడు రావణుడు లక్ష్మణుడి వద్దకు వచ్చి, అతన్ని తన చేతులలో ఎత్తటానికి ప్రయత్నించాడు, కాని సాధ్యం కాలేదు.

ఇంతలో హనుమంతుడు వచ్చి రావబుణ్ణి తన పిడికిలితో రొమ్ములో పొడిచాడు. ఆ దెబ్బకు రావణుడు మోకాళ్ళ పైన ముందుకు పడిపోయి, రక్తం కక్కుకుని,తన రథం మీద స్పృహ తప్పి పడిపోయాడు. హనుమంతుడు లక్ష్మణుణ్ణు తనచేతులలో ఎత్తుకుని రాముడి వద్దకుతెచ్చాడు. కొద్ది సేపటిలో లక్ష్మణుడికి మూర్ఛ తెలిసింది. రావణుడికి కూడా స్పృహ వచ్చింది.

హనుమంతుడు రాముడితో, “నా వీపు మీద ఎక్కి రావణుడితో యుద్ధం చెయ్యి,” అన్నాడు. రాముడా ప్రకారమే హనుమం తుడి భుజాల పైన ఎక్కి కూర్చున్నాడు. హనుమంతుడు రాముణ్ణి రావణుడి ఎదటికి తీసుకు పోయాడు.

రావణుడు హనుమంతుణ్ణి తీవ్రమైన బాణాలు వేసి కొట్టాడు. అది చూసి రాముడు క్రోధంతో రావణుడి రథ చక్రాలనూ, గుర్రాలనూ, ధ్వజాన్ని, సారధిని నాశనం చేసి, రావణుడి రొమ్ములో పిడుగులాటి బాణాన్ని నాటాడు. ఆ దెబ్బకు రావణుడు పడిపోగా మరొక బాణంతో అతని కిరీటాన్ని భగ్నం చేసేసి, ” రాక్షసరాజా, చాలా గొప్ప యుద్ధం చేసి అలిసిపోయి ఉన్నావు. అందు చేత నిన్నిప్పుడే యమపురానికి పంపను. లంకకు తిరిగి వెళ్ళటానికి అనుమతిస్తు న్నాను. వెళ్ళి, విశ్రాంతి తీసుకుని, రథ మెక్కి, బాణం పట్టుకుని మళ్ళీరా. అప్పుడు నా శక్తి చూపుతాను,” అన్నాడు.

రావణుడు గర్వభంగం పొంది, సిగ్గుపడుతూ లంకకు తిరిగి వెళ్ళాడు. అతనికప్పుడు రాముడంటే నిజంగా భయం పట్టుకున్నది. అతను రాక్షసులను సమావేశ పరిచి ఇలా అన్నాడు.

“ఇంద్రుడికి తీసిపోని నేను ఒక మనుష్య మాత్రుడికి ఓడిపోయాను! నా తపస్సంతా ఏమయిందో తెలియటం లేదు. నాకు మనుష్యుల వల్ల ప్రమాదం ఉంటుందని ఒకప్పుడు బ్రహ్మ చెప్పాడు. వెనక నేను అనరణ్యు డనే ఇక్ష్వాకు రాజును చంపేటప్పుడు, నన్ను సర్వ నాశనం చేయగలవాడు తన కులంలోనే జన్మిస్తాడని ఆయన అన్నాడు. వెనక వేదవతిని బలాత్కరించి ఆవిడ చేత శాపం తిన్నాను. ఆ వేదవతే ఈ సీత. పార్వతీ, నందీశ్వరుడూ, రంభా, పుంజికస్థలా ఏమేమి. అనారో, అదంతా ఈనాడు నిజం ఆవు తున్నది. ప్రమాదం మనసులో ఉంచుకుని శత్రుసంహారం విషయంలో మీరు మరింత శ్రద్ధవహించండి. ద్వారాలనూ, గోపురాలనూ శ్రద్ధగా కాపలాకాయండి. కుంభ కర్ణుడు నిద్రపోతున్నాడు. అతన్ని లేపండి. నే నిక్కడ నానా అవస్థా పడుతూంటే అతను హాయిగా నిద్రపోతున్నాడు. యుద్ధలోచన చేసేటప్పుడు కూడా మేలుకునే ఉన్నాడు. అటువంటి వాడు, తొమ్మిది రోజులకు యుద్ధం ఆరంభ మవుతుందనగా నిద్రపోయాడు. అతన్ని లేపండి. నాలాగా అతను శాపాలకు గురి అయినవాడు కాడు. అవలీలగా వానరసేననూ, రామ లక్ష్మణు లనూ నిర్మూలించగల వాడు. రాముడి చేత దెబ్బ తిన్న నాకు కుంభకర్ణుడు లేస్తే ధైర్యంగా ఉంటుంది. కుంభకర్ణుడు ఇటు వంటి తరుణంలో పక్కన లేకపోతే అతను ఉండి ప్రయోజనమేమిటి?”

రావణుడి మాట అనగానే రాక్షసులు కుంభకర్ణుడి ఇంటికి బయలుదేరారు. వాళ్ళు తమ వెంట గంధమూ, పూల మాలలూ, ఆహారమూ పట్టుకు పోయారు. ఒక బ్రహ్మాండమైన గుహలాటి ఇంట కుంభ కర్ణుడు పడుకుని నిద్రపోతున్నాడు. అతను విడిచే ఊపిరి, రాక్షసులు లోపలికి ప్రవేశించటానికి యత్నిస్తే, బయటికి తోసేసింది. అతి కష్టం మీద వాళ్ళు చివరికి గుహలో పలికి వెళ్ళారు.

కుంభకర్ణుడు భయంకరమైన ఆకారంతో పడుకుని గాఢ నిద్రలో ఉన్నాడు. అతని ముందు రకరకాల మాంసాలు పెట్టి ఉన్నాయి. అన్నం రాసులుగా పోసి ఉన్నది.. మద్యమూ, నెత్తురూ కడవలలో ఉన్నాయి. అతన్ని లేపటానికి రాక్షసులు విశ్వప్రయ త్నాలు చేశారు. అందరూ కలిసి గట్టిగా అరిచారు, భయంకరమైన ధ్వనులు చేశారు. గదలతోనూ, రోకళ్ళతోనూ అతని శరీర మంతా బాదారు. కుంభకర్ణుడు నిద్రలేవక పోగా, కదలనైనాలేదు.

రాక్షసులకు మండి పోయింది. వాళ్ళు ఏనుగుల చేత కుంభకర్ణుణ్ణి తొక్కించారు. ఏవో పురుగులు పాకు తున్నట్టనిపించి కుంభ కర్ణుడు మేలుకున్నాడు. అతను లేచి కూర్చుని పెద్ద పెట్టున ఆవలించాడు.

కుంభకర్ణుడు నిద్రలేస్తూనే మాంసంతిని, మద్యం తాగి చుట్టూ కలయ జూసి, రాక్ష సులతో, “మీరంతా వచ్చి నన్నెందుకు నిద్రలేపారు? రావణుడికి క్షేమమేగదా? ఏదో విపత్తు వచ్చిపడి ఉంటుంది. అందుకే మీరింత తొందరపడి నన్ను నిద్ర లేపారు. సంగతేమిటో చెప్పండి,” అన్నాడు.

కుంభకర్ణుడు పడుకుంటే మూడు నెలలూ, ఆరు నెలలూ, ఒక్కొక్కప్పుడు తొమ్మిది నెలలు కూడా నిద్ర పోయేవాడు.

రావణుడి మంత్రి యూపాక్షుడనేవాడు కుంభకర్ణుడితో, ” కుంభకర్ణా! పూర్వం దేవ తల వల్ల కూడా కలిగి ఉండనంతటి భయం ఇప్పుడు మానవుల వల్ల కలిగింది. కొండలంతేసి వానరులు లంకను ముట్టడించి ఉన్నారు. సీతను ఎత్తుకు వచ్చినందు కాగ్రహించి రాముడి పని చేశాడు. కొంత కాలం క్రితం ఒక వానరుడు వచ్చి లంకను తగలబెట్టి, అక్షకుమారుణ్ణి చంపేశాడు. దేవతలనందరినీ జయించిన రావణుణ్ణి రాముడు కొన ప్రాణంతో విడిచిపెట్టాడు. ఏ దేవతలూ చెయ్యలేని పని ఇప్పుడా రాముడు చేశాడు,” అన్నాడు.

తన అన్న అపజయ వార్త విని కుంభ కర్ణుడు కోపోద్రేకంతో గుడ్లు గుండ్రగా తిప్పుతూ, “నేనా వానరసేననూ, రామ లక్ష్మణులనూ చంపేసి తరవాత రావణుణ్ణి చూస్తాను. రామలక్ష్మణుల రక్తం నేను తాగి, వానరుల రక్తం రాక్షసుల చేత తాగిస్తాను,” అన్నాడు.

మహోదరుడనే రాక్షస ప్రముఖుడు కుంభకర్ణుడికి చేతులు జోడించి, “కుంభ కర్ణా, నీవు రావణుడి వద్దకు వచ్చి, ఆయన చెప్పేది విని, మంచి చెడ్డలు సరిగా అలోచించుకుని, ఆపైన శత్రువుల పైకి యుద్ధానికి పోతే విజయం పొందటానికి వీలుగా ఉంటుంది,” అన్నాడు.

కుంభకర్ణుడందుకు సమ్మతించి రాక్ష సుల నందరినీ వెంట బెట్టుకుని రావణుడి ఇంటికి వెళ్ళటానికి సిద్ధమయాడు. రాక్షసులు ముందు వెళ్ళి రావణుడి దర్శనం చేసుకుని, “మీ తమ్ముడు కుంభకర్ణుణ్ణి నిద్ర లేపా? ఏమి శలవు? అతను తిన్నగా యుద్ధానికి వెళ్ళవచ్చునా? లేక ఇక్కడికి రావాలా?” అని అడిగారు.

కుంభకర్ణుడు మేలుకున్నాడని విని రావణుడు సంతోషించి, “అతన్ని సగౌరవంగా ఇక్కడికే తీసుకురండి,” అని రాక్షసులతో అన్నాడు. వాళ్ళు కుంభకర్ణుడి వద్దకు తిరిగి వెళ్ళి రావణుడురమ్మం టున్నాడని చెప్పారు.

కుంభకర్ణుడు రావణుడి ఇంటికి బయలు దేరాడు. అతను అంగ వేస్తుంటే భూమి దద్దరిల్లింది. దారి పొడుగునా ఎదురైన రాక్ష సులతనికి నమస్కారాలు చేశారు. లంక బయటి నుంచి అతన్ని చూసి వానరులు దడుచుకున్నారు. కొందరు వాసరులు పారి పోసాగారు.

రాముడు కుంభకర్ణుణ్ణి చూసి విభీష ణుడితో, ” లంకలో పర్వతాకారుడైన వీరుడొకడు కిరీటం ధరించి కనబడుతున్నాడే. ఎవరతను? అతన్ని చూసి మన వానరులు. పారిపోతున్నారు!” అన్నాడు.

“అతను కుంభకర్ణుడు. యుద్ధంలో ఇంద్రుణ్ణి, యముణ్ణి గెలిచినవాడు. రాక్షసులలో అంత పెద్ద శరీరం కలవాడు లేడు. అతని బలం సహజమైనది, వరాల వల్ల వచ్చినది కాదు,” అన్నాడు విభీషణుడు.

కుంభకర్ణుణ్ణి గురించి విభీషణుడు రాముడితో ఇంకా ఈ విధంగా చెప్పాడు

కుంభకర్ణుడు పుట్టుతూనే ఆకలివేసి మనుష్యులను వేల సంఖ్యలో తినసాగాడు. ప్రజలు బెదిరిపోయి ఇంద్రుణ్ణి శరణు జొచ్చారు. ఇంద్రుడు అలిగి కుంభకర్ణుడిపై వజ్రాయుధం ప్రయోగించాడు. కుంభ కర్ణుడు ఐరావతం యొక్క దంతాన్ని పెరికి ఇంద్రుణ్ణి రొమ్ములో కొట్టాడు.

ఇంద్రుడు ప్రజలను వెంటబెట్టుకుని బ్రహ్మ దగ్గిరికి వెళ్ళి, కుంభకర్ణుడు ప్రజలను తింటున్నాడనీ, దేవతలను అవమానిస్తున్నాడనీ, ఆశ్రమాలను ధ్వంసం చేస్తున్నాడనీ, పరస్త్రీలను హరిస్తున్నాడనీ బ్రహ్మతో చెప్పాడు.

బ్రహ్మ, రాక్షసుల నందరినీ పిలిపించి, వారిలో కుంభకర్ణుణ్ణి చూశాడు. ఆయన కుంభకర్ణుడితో, ” విశ్రవసుడు నిన్ను కన్నది ప్రజాక్షయం చెయ్యటానికి లాగా ఉందేమిరా! ఇది మొదలు నీవు ఒళ్ళు తెలియ కుండా పడి నిద్రపోతూ ఉండు,” అన్నాడు.

కుంభకర్ణుడు బ్రహ్మ ఎదటనే నిద్ర ముంచుకొచ్చి పడిపోయాడు. అది చూసి. రావణుడు, “తాతా, నీ మునిమనమణి ఇలా శపించటం అన్యాయం. వీడి నిద్రకూ, మెలకువకూ కాల నియమం ఏర్పాటు చెయ్యి,” అన్నాడు.

“వీడు ఆరు మాసాల పాటు నిద్ర పోయి ఒకరోజు మేలుకుని ఉంటాడు,” అన్నాడు బ్రహ్మ.

విభీషణుడు రాముడి కీ విషయాలు చెప్పి, “రామా, నీ దెబ్బకు రావణుడు బెదిరిపోయి నిద్రపోతున్న కుంభకర్ణుణ్ణి లేపాడు. అతన్ని చూసే బెదిరి పారిపోయే వానరులు అతనికి యుద్ధంలో ఎదురునిల్చి ఏం పొట్లాడగలరు? అందుచేత వానరులతో మనం ఇదొక నడిచే యంత్రమని చెప్పాలి,” అని చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *