శ్రీ రాముడు సముద్రుడిపై కోపగించుట

“గంధర్వ ఉరగ రాక్షసుల చేతనూ, ఏ భూతం చేతనూ చావు లేకుండా రావణుడు బ్రహ్మ నుంచి వరం పొందాడు. రావణుడికి తమ్ముడూ, నాకు అన్నా అయిన కుంభకర్ణుడు మహా బలశాలి, యుద్ధంలో ఇంద్రుడికి సమానుడు. రావణుడి సేనాపతి అయిన ప్రహస్తుడు కుబేర సేనాపతి అయిన మాణిభద్రుణ్ణి జయించిన వాడు. హనుమంతుడతన్ని గురించి చెప్పే ఉంటాడు. రావణుడి కొడుకు ఇంద్రజిత్తు వరప్రసాదుడు; అతను అభేద్యమైన కవచం ధరించి, యుద్ధం చేస్తూనే అదృశ్యుడైపోయి శత్రువులను చంప గలవాడు. మహోదరుడూ, మహాపార్శ్వుడూ, అకంపనుడు అనే రావణ సేనాపతులు దిక్పాల కులతో సమంగా యుద్ధం చెయ్య గల వారు. రక్తమాంసాహారులూ, కామరూపులూ అయిన రాక్షసులు లంకలో పదివేల కోట్ల మంది ఉన్నారు. వారి సహాయంతోనే రావణుడు దిక్పాలకులను జయించాడు.”

విభీషణుడు చెప్పిన ఈ మాటలు విని రాముడు, ” విభీషణా, ఈ పనులన్నీ చేసిన రావణుణ్ణి, ప్రహస్తుణ్ణి, రావణుడి బలగాన్నీ చంపి, లంకా రాజ్యం నీకు చేకూర్చుతాను, నా మాట నమ్ము, అతను రసాతలానికి పోనీ, పాతాళానికి పోనీ, బ్రహ్మ లోకానికే పోనీ, నేను ప్రాణాలతో వదలను. అతణ్ణి సపరివారంగా వధించకుండా అయోధ్యకు తిరిగిపోను, నా ముగ్గురు తమ్ముల మీద ఒట్టు!” అన్నాడు.

” ఆ యుద్ధంలో నేను కూడా పాల్గొని శక్తికొద్దీ రాక్షసులను చంపుతాను, మీకు సహాయం చేస్తాను,” అన్నాడు విభీషణుడు.

రాముడు సంతృప్తుడై లక్ష్మణుడితో సముద్రజలం తెచ్చి, విభీషణుణ్ణి లంకకు రాజుగా అభిషేకించ మన్నాడు. లక్ష్మణుడు వానరుల మధ్య విభీషణుణ్ణి లంకా రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. వానరులు సింహనాదాలు చేసి రాముడికి జయధ్వానాలు పలికారు.

తరవాత సుగ్రీవ హనుమంతులు విభీషణుడితో ఏకాంతంగా చేరి, ” ఇంత మందిమీ ఈ మహాసముద్రాన్ని దాటి లంక చేరటమెలాగో మాకు తెలియలేదు. ఆ ఉపాయం నీవే చెప్పాలి,” అన్నారు.

“రాముడు సముద్రుడి శరణు పొందాలి. సముద్రుడు రాముడి పూర్వీకుడైన సగరుడికి ఋణపడి ఉన్నాడు; అందు చేత రామకార్యం తీరుస్తాడు,” అన్నాడు విభీషణుడు.

సుగ్రీవుడు రామలక్ష్మణులున్న చోటికి వెళ్ళి, విభీషణుడన్న మాట చెప్పి, సముద్రుణ్ణి ఆరాధించాలని రాముడితో అన్నాడు. రాముడందుకు ఒప్పుకుని, సముద్రతీరాన దర్భలు పరిచి, వాటి పైన పడుకున్నాడు.

ఈలోపుగా శార్దూలు డనే రాక్షసుడు, రావణుడి వేగులవాడు, వానరసేన ఉన్న చోటికి వచ్చి, అక్కడి పరిస్థితులన్నీ చూసి, రావణుడి వద్దకు తిరిగివెళ్ళి, “వానర భల్లూక సేన అపరసముద్రంలాగా లంక పైకి వస్తున్నది. ఉత్తమాయుధాలు ధరించి సీత కోసం వస్తున్న రామలక్ష్మణులు సేనతో సహా సముద్రతీరాన విడిసి ఉన్నారు. ఆ సేన యొక్క విస్తీర్ణం ఎటు చూసినా పది యోజనాలున్నది. నేనీ విషయాలు స్థూలంగా చూసి వచ్చాను. వివరంగా చూసి రావటానికి మరెవరినైనా పంపటం మంచిది,” అన్నాడు.

అప్పుడు రావణుడు శుకుడనే రాక్షసుడితో, “నీవు సుగ్రీవుడి వద్దకు వెళ్ళి, మంచిగా ఈ మాటలు చెప్పు,” అని, ఏమి చెప్పాలో చెప్పి పంపాడు.

శుకుడు పక్షి రూపం ధరించి లంక నుంచి బయలుదేరి సముద్రం దాటి, వానరసేన దగ్గిరకు ఎగురుతూ వెళ్ళి, సుగ్రీవుడు మొదలైన వారి మీదుగా గాలిలోనే ఉండి ఇలా చెప్పాడు.

“వానర రాజైన సుగ్రీవుడా! రావణు డిలా అన్నాడు. ఉన్నత వంశంలో పుట్టిన వాడవు. మహాబలుడవు. జన్మతః నాకు బంధువులాటి వాడివి. ఆకారణంగా నాతో విరోధ మెందుకు ? ఇందువల్ల నీకు ఒరి గేదీ, తరిగేది లేదు. వాలి నా స్నేహితుడు. నీవు నా తమ్ముడిలాటి వాడివి. నేను రాముడి భార్యను తెస్తే నీ కేమిటి? బుద్ధి మంతుడవు, బాగా ఆలోచించుకుని కిష్కింధకు తిరిగి వెళ్ళు. ఈ విషయంలో నీ ప్రమేయ మేమీ లేదు. లంకను దేవతలే ప్రవేశించ లేరు గదా, నరుల మాటా, వానరుల మాటా చెప్పే దేమిటి ?”

ఈ మాటలు వింటూనే వానరులు ఆకాశాని కెగిరి సుకుణ్ణి పట్టుకుని ఆకాశం మీది నుంచి నేల మీదికి పడదోశారు. శుకుడు ఎలుగెత్తి, “ఓ రామా, నన్నీ వానరులు చంపేస్తున్నారు. దూతను చంపరాదు. నా ప్రభువు అనమన్న మాటలే అన్నాను గాని నేను సొంతాన ఏమీ అనలేదు,” అని అరిచాడు.

రాముడు జాలిపడి, ” వాణ్ణు చంపకండి” అన్నాడు వానరులతో.

శుకుడు దెబ్బతిన్న రెక్కలతో ఆకాశం లోకి లేచి, “సుగ్రీవుడా, రావణుడితో ఏం చెప్పమంటావు?” అని అడిగాడు.

“రావణుడితో ఇలా అన్నానని చెప్పు. రాక్షసరాజా, నీవు నాకు స్నేహితుడవు కావు, మేలుచేసిన వాడవు కావు, నా మిత్రుడైన రాముడికి శత్రువువు, నా శత్రువైన వాలికి మిత్రుడవు. అందుచేత తప్పక చంపదగిన వాడవు. నేను నిన్ను సకుటుంబంగా చంపి లంక్షను భస్మీపటలం చేస్తాను. నిన్ను రాముడి బారి నుంచి దేవతలు కూడా రక్షించ లేరు. ముసలి జటాయువును చంపినట్టు కాదు, రామలక్ష్మణులు లేనప్పుడు దొంగతనంగా సీతను ఎత్తుకు వచ్చినట్టూ కాదు, రాముడి ప్రతాపం నీకు తెలియదు. ” అని సుగ్రీవుడు శుకుడితో అన్నాడు.

అంతలో అంగదుడు సుగ్రీవుడితో, ” వీడు దూతలాగా లేడు, వేగుల వాడని తోస్తున్నది. మనతో మాట్లాడుతూనే శిబిర మంతా చూశాడు, వీణ్ణి పట్టుకోండి. లంకకు పోనివ్వకండి,” అన్నాడు.

సుగ్రీవుడి ఆజ్ఞానుసారం వానరులు శుకుణ్ణి మళ్ళీ పట్టుకున్నారు. శుకుడు మళ్ళీ ఆక్రోశిస్తూ, ఓ రామా, దూతనైన నన్ను ఈ వానరులు రెక్కలు విరుస్తున్నారు, కళ్ళు పీకేస్తున్నారు,” అని పెద్దగా మోరపెట్టుకున్నాడు.

రాముడు కోతులతో చెప్పి శుకుణ్ణి కాపాడాడు. తరువాత అతను సముద్రుడికి నమస్కరించి చెయ్యి తల కింద పెట్టుకుని, సముద్రుడికి ఎదురుగా పడుకున్నాడు.

రాము డలా మూడు రాత్రులు గడి పాడు, అంతకాలమూ సముద్రుణ్ణి ధ్యానిం చాడు. కాని సముద్రుడు సాక్షాత్కరించ లేదు. అతనికి కోపం వచ్చింది. లోకంలో మంచి వాళ్ళు అసమర్థులుగా గణించబడ తారు. సముద్రుడు తనను అలాగే భావించి ఉంటాడు. అందుచేత రాముడు సముద్రుడికి తన ప్రతాపం చూప నిశ్చయించి, లక్ష్మణుడితో, ” లక్ష్మణా, నా ధనుర్బాణా లిలా ఇయ్యి. సముద్రాన్ని ఎండించి, వానరులు కాలినడకన లంకకు చేరేలాగు చేస్తాను. సముద్రంలోని జలమంతా భూమిపైకి పారేటట్టు చేస్తాను,” అన్నాడు.

అతను బాణాలు ఎక్కుపెట్టి వదిలాడు. అవి ధగధగా వెలిగిపోతూ వెళ్ళి సముద్రం ప్రవేశించి, సముద్రాన్ని అల్లకల్లోలం చేశాయి. సముద్రంలో బ్రహ్మాండమైన తరంగాలు పుట్టాయి, నీటి అడుగునఉండే శంఖాలూ, ముత్యపు చిప్పలూ, భయంకరమైన సముద్ర ప్రాణులూ పైకి తేలాయి.

లక్ష్మణుడు రాముడి చెయ్యి పట్టుకుని, ” ఇంక చాలు! ఊరుకో!” అన్నాడు. రాముడు వినిపించుకోలేదు..

“సముద్రుడా! నిన్ను పాతాళం దాకా ఇగిర్చేస్తాను ! నీలో ఉన్న ప్రాణులన్నిటినీ దహించేసి, నిన్ను అనుకపర్రగా చేసి వదిలే స్తాను! నా బలపరాక్రమాలు నీకు తెలియవు! నేను నిన్నేం చెయ్యగలనో తెలుసుకో లేకుండా ఉన్నావు!” అన్నాడు. రాముడు, తనకు ప్రత్యక్షం కాని సముద్రుడితో.

తనొక భయంకరమైన బాణాన్ని తీసి బ్రహ్మాస్త్రం పఠించి, చెవి దాకా లాగాడు. అతను దాన్ని వదిలిపెట్టక మునుపే భూమ్యాకాశాలు బద్దలయినంత పని అయింది, కొండలు అదిరాయి, లోకాలన్ని నీ చీకటి ఆవరించింది; నదులూ, సరస్సులూ కలకపారాయి. సూర్యచంద్రుల, నక్షత్రాల గతులు తప్పాయి. చీకటి కమ్మింది. పిడుగులు పడ్డాయి. ఆకాశాన ప్రచండమారుతాలు వీచాయి. వాటి వేగానికి మహావృక్షాలు విరుచుకు పడిపోయాయి. ఈ ఉత్పాతాల మధ్య సముద్రపు నీరు ఒక ఆమడ వెనక్కు పోయింది. సముద్రుడు వెనక్కు తగ్గటం చూసి రాముడు బాణం వదలలేదు.

అంతలోనే సముద్ర మధ్యంలోని బ్రహ్మాండమైన అలల మధ్య నుంచి సముద్రుడు, సమస్త నదులూ వెంటరాగా, వెలువడి వచ్చాడు. ఆయన దేహం వైడూర్య వర్ణంగా ఉన్నది; ఎర్రని మాలలూ, బట్టలూ ధరించాడు, రంగురంగుల పుష్పమాలికలు తలలో ధరించాడు; అనేకమైన బంగారు నగలు ధరించాడు; అతని మెడలోని ముత్యాల హారాల మధ్య కౌస్తుభమణి యొక్క తోబుట్టువు ప్రకాశిస్తున్నది.

సముద్రుడు రాముణ్ణి సమీపించి, ముందుగా తానే రాముడి పేరు చెప్పి నమస్కరించి, “రామా, లోతు అన్నది నాకు స్వభావసిద్ధమైనది. ఆ గుణాన్ని నేను విసర్జించలేను. కాకపోతే, వానరులు వారధి కట్టేటప్పుడు వారికి సముద్ర ప్రాణుల భయం లేకుండా చెయ్యగలను, వారికి సహాయపడగలను,” అన్నాడు.

“అలా అయితే, ఎక్కుపెట్టిన ఈ అమోఘాస్త్రాన్ని ఏమి చెయ్యను?” అని రాము డడిగాడు.

“ఇలా ఉత్తరంగా ద్రుమకుల్య మనే అందమైన ప్రదేశం ఉన్నది. అక్కడ భయంకరులైన దొంగలు కొందరుండి, నా జలాన్ని తాగి, సమస్త పాపకార్యాలూ చేస్తున్నారు. ఎంతో కాలంగా వారి స్పర్శ సహించ లేకుండా ఉన్నాను. నీ బాణాన్ని వారిపై ప్రయోగించు,” అని సముద్రుడు, రాముణ్ణి కోరాడు.

ఆ ప్రకారమే రాముడు తన బాణాన్ని ద్రుమకుల్యం పైన ప్రయోగించాడు. ఆ బాణం పిడుగులాగా వెలుగుతూ వెళ్ళి పడినచోటుకు మరుకాంతార మని పేరు వచ్చింది. బాణం పెద్ద మోతతో భూమిని చీల్చుకుని వెళ్ళిన చోట పాతాళం నుంచి జల పుట్టుకొచ్చింది. వ్రణకూపమని పేరు పొందిన ఆ జల ఎన్నడూ ఆగక ప్రవహిస్తూనే ఉంటుంది. ద్రుమకుల్యంలో ఉండిన దొంగలందరూ నశించారు.

అప్పుడు సముద్రుడు రాముడితో, “నీ సేనలో గల నళుడనే వానరోత్తముడు విశ్వకర్మ కొడుకు. శిల్ప విద్యలలో తండ్రిక తీసిపోడు. ఇతని చేత సేతువు నిర్మింప జెయ్యి. అది మునగ కుండా నేను చూస్తాను,” అన్నాడు.

ఈ మాట చెప్పి సముద్రుడు అంత ర్ధానం కాగానే నళుడు, ” సముద్రు డన్న మాట నిజమే. నేను సేతువు నిర్మించ గలను. నా శక్తి మరొకరు చెబితే బాగుం టుందని నాకై నేనే చెప్పదలచలేదు. కావలిస్తే వానరులందరూ కలిసి ఇప్పుడే సేతు నిర్మాణం ప్రారంభించవచ్చు.” అన్నాడు రాముడితో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *