సీతారామ లక్ష్మణులు దశరదుని వద్దకు వెళ్లుట

దశరథుడు సీతా రామలక్ష్మణులను పిలుచుకురమ్మని సుమంత్రుడితో అన్నాడు.

సీతా రామలక్ష్మణులు వీధుల వెంబడి పోతుంటే మేడల మీది నుంచీ, మిద్దెల మీది నుంచిచూసే పౌరులకు కడుపు మండిపోయింది. వాళ్ళు రకరకాలుగా తమలో తాము మాట్లాడుకున్నారు.

“చూడండర్రా, రాముడు కాలినడకను భార్యనూ, తమ్ముణ్ణి వెంటబెట్టుకుని ఎలా పోతున్నాడో! కాకపోయినా ఈ దశరథుడికేదో దయ్యం పట్టినట్టుంది. ఎంత దుర్మార్గుడైన కొడుకునైనా రాజైనవాడు అడవులకు పంపడుగదా, బంగారంలాటి రాముణ్ణి అడవికి పంపిస్తున్నాడే! మన మందరమూ కుటుంబాలతో సహా రాముడి వెంటపోతే రోగం వదిలిపోతుంది !”

పౌరులు గట్టిగా అనుకునే, ఈ మాటలన్నీ వింటూ సీతా రామలక్ష్మణులు దశరథుడి నగరుచేరి, సుమంత్రుడి ద్వారా తాము ఆయనను చూడవచ్చినట్టు రాజుకు కబురు చేశారు.

చేతులు జోడించి వచ్చే రాముడు కన బడగానే దశరథుడూ, ఆయన అంతఃపుర స్త్రీలూ లేచి నిలబడ్డారు. దశరథుడు రాముడి కెదురు పోబోయి మధ్య దారిలోనే పడిపోయాడు. ఆయనను ఎత్తి పాన్పుపై పడుకోబెటారు.

స్పృహ వచ్చి దశరథుడు కళ్ళు తెరవగానే రాముడు, “మహారాజా, నేను దండకారణ్యానికి పోతున్నాను. మీరు ప్రభువు గనక మీ అనుమతి కోసం వచ్చాను. నేనెంత చెప్పినా వినక సీతా లక్ష్మణులు నా వెంట బయలు దేరారు. వారి వనవాసానికి కూడా అనుమతి ఇవ్వండి,” అన్నాడు.

దశరథుడు రాముడితో, “నాయనా, రామా! కైకేయికి వరమిచ్చి నేను మోస పోయాను. నీవు నా ఆనతి అతిక్రమించి పట్టాభిషేకం చేసుకో!” అన్నాడు.

“మీరు సత్యదోషం కట్టుకో కండి. అడవికి పోవటానికి నా కేమీ అభ్యంతరం లేదు. పధ్నాలుగేళ్ళూ సుఖంగా వన వాసం చేసి మళ్ళీ మీ దగ్గిరికి వస్తాము,” అన్నాడు రాముడు.

“మీరు ఇవాళే వెళ్ళాలని ఏమిటి? ఈ రాత్రికి ఇక్కడ ఉండి నా వల్ల మీకు కావలిసిన వన్నీ పొంది, ఈ ఒక్క రాత్రి మమ్మల్నందరినీ సంతోష పెట్టి, రేపు ఉదయం అరణ్యానికి బయలుదేర వచ్చు.” అన్నాడు దశరథుడు.

“తండ్రి, మా కోరికలన్నీ మీరు తీర్చి ‘నట్టే భావించి మమ్మల్ని వెళ్ళనివ్వండి. మాకు మీ ఆశీర్వాదం ఇచ్చి సంతోషంగా పంపండి. అరణ్యంలో మా కేమీ కష్టాలుండవు. అనేక పర్వతాలూ, సరస్సులూ, వింతలూ చూస్తాం,” అన్నాడు రాముడు.

రాముడడవికి పోతున్నందుకు దశరథుడు పొందే సంతాపం చూసి సుమం త్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చినవాడై, కళ్ళ నిప్పులు రాలుస్తూ, పళ్ళు పటపట కొరుకుతూ, కైకేయితో,

“దుష్టురాలా! నిన్ను ప్రాణంకన్న ఎక్కువగా చూసుకునే మహారాజు కింత శోకం తెచ్చిపెట్టావే, నీ వింకేమి చెయ్యలేవు? నీ వాలకం చూస్తే భర్తను చంపుకునేదానివిగానూ, వంశనాశనం కలిగించే దానివిగానూ కనిపిస్తున్నావు.

“అందరిలోకీ పెద్ద కొడుకైన రాముడు పట్టాభిషేకం చేసుకోవటానికి నీ అభ్యంతర మేమిటి? భరతుడు రాజ్యం చేస్తే మేమంతా. ఇక్కడ ఉంటామనుకుంటున్నావా? అయోధ్యలో ఒక్క బ్రాహ్మడుంటాడా ? ఎందుకు చేస్తున్నావీ పాడుపని? మొత్తానికి ఆ తల్లి కూతురనిపించు కున్నావు!”

“నీ తండ్రి అయిన అశ్వపతికి ఒక మునీశ్వరుడు ఒక అపూర్వమైన శక్తి ఇచ్చాడు. దానితో ఆయన పశు పక్ష్యాదుల భాషలన్నీ నేర్చుకున్నాడు. ఒకనాడాయన మంచం మీద పడుకుని ఉండగా జృంభమనే ఒక చీమ ఏదో అనే సరికి ఆయన పకపకా నవ్వాడు. అది చూసి మీ అమ్మ, ఎందుకు నవ్వావో చెప్పు అన్నది. ఎందుకు నవ్వానో చెబితే నేను చచ్చి పోతానన్నాడు మీ తండ్రి. నువు చస్తావో, బతుకుతావో నాకు తెలీదు, నన్ను చూసి నవ్వలేదని నాకేమిటి నమ్మకం? అందుచేత నవ్విన కారణం చెప్పాలిసిందే నన్నది మీ అమ్మ.”

“అప్పుడు మీ నాన్న తనకు వరమిచ్చిన ముని దగ్గరికి పోయి ఆయన సలహా అడిగాడు. నీ భార్య చచ్చి గీపెట్టినా చెప్పకు అన్నాడు ముని. అప్పుడు మీ నాన్న మీ అమ్మను వెళ్ళగొట్టి సుఖంగా ఉన్నాడు. నీ ధోరణి కూడా అలాగే ఉంది. తండ్రిని విడిచి రాముడు అడవికి వెళ్ళాడో గొప్ప ఆపద కలిగి తీరుతుంది. అందుచేత నీ వక్రబుద్ధి మాని రాముడి పట్టాభిషేకానికి ఒప్పుకో!” అని హితవు చెప్పాడు.”

ఈ మాటలకు కైక సిగ్గు పడలేదు సరికదా, చలించను కూడా లేదు. దశరథుడు మాత్రం సుమంత్రుడితో, “రాముడి వెంట అడవికి చతురంగ బలాలనూ, విశేష మైన ధనాన్నీ, అందగత్తెలయిన స్త్రీలనూ, సంబారాలతో వర్తకులనూ పంపించు. బళ్లు కూడా వెంట ఇచ్చి పంపించు, రాముడికి రాజ్యం లేదన్న లోపం తెలియకుండా చూడు,” అన్నాడు.

సుమంత్రుడి శాపనార్థాలకు చలించని కైకేయి ఈ మాటలు విని తెల్లబోయి, బెదిరి, గొంతు ఆర్చుకుపోయి, “మహారాజా, ఆయోధ్యను పాడు బెట్టి అందరూ వెళ్ళిపోతే భరతుడు పాలించడు!” అన్నది.

“ఓసి దుర్మార్గురాలా! నా మీద మొయ్యరానంత బరువు వేసింది చాలక ఈ కొరడా దెబ్బలు కూడా ఏమిటి? ఇదంతా ఆ వరాల లోనే చేర్చి అడగక పోయావా?” అన్నాడు. దశరథుడు కోపంగా.

కైకేయి అంతకన్న హెచ్చు కోపంతో, ” అది వేరే అడగాలా ఏమిటి? అరణ్యానికి పొమ్మంటే అన్నీ విడిచిపెట్టి పోవటంకాదా? మీ పూర్వీకుడు సగర చక్రవర్తి తన పెద్ద కొడుకైన అసమంజుణ్ణి వెళ్ళగొట్టి నప్పుడు వాడి వెనకగా సైన్యాన్ని పంపాడా?” అని అడిగింది.

ఈ మాట విని సిద్ధార్థుడనే మంత్రి, ” అమ్మా, అసమంజుడి మాట ఇక్కడ దేనికి? వాడు పరమ దుష్టుడు. వాడు వీధుల్లో ఆడుకునే పిల్లలను తీసుకుపోయి సరయూ నదిలో పడేసి వాళ్ళు ఎలా చస్తారో చూసి ఆనందించే పాపాత్ముడు.”

“అందుచేత పౌరులు కడుపుమంటతో రాజు వద్దకు వెళ్ళి, ‘ ఆయ్యా, తమరు ఆసమంజు వెళ్ళగొడ తారా, మమ్మల్ని దేశం విడిచి వెళ్ళి పొమ్మన్నారా ? ఏదో ఒకటి తేల్చి చెప్పండి ! అని అడగగా సగర మహారాజు జనద్రోహి అయిన తన కొడుకునూ, వాడి భార్యనూ, పరివారాన్ని వెళ్ళగొట్టి, వాణ్ణి తిరిగి రాజ్యంలో అడుగు పెట్టనివ్వవద్దని కట్టుదిట్టం చేశాడు. జనద్రోహి అసమంజుడికి జనప్రియుడైన రాముడికి సాపత్యం చెప్పావే !” అన్నాడు.

ఈ మాటలకు కైక చలించక పోవటం చూసి దశరథుడు, ” ఓసి పాపాత్మురాలా ! నిన్ను చూస్తే నీకు హితం తలకెక్కేటట్టు లేదు. నేను కూడా రాముడి వెంట అడవికి పోతాను. నీవూ, భరతుడూ సుఖంగా రాజ్య మేలండి” అన్నాడు.

ఈ సంభాషణ అంతా వింటున్న రాముడు తండ్రితో, “మహా రాజా, అన్ని సుఖాలూ విడిచి, అడవిలో కందమూలాలు తినబోయే నా వెంట సేన కూడా దేనికి? ఏనుగును దానం చేసి కట్టుతాడు దగ్గిర లోభించే పద్ధతి మానండి. మాకు నార బట్టలూ, దుంపలు తవ్వుకునే పరికరాలూ, ఒక బుట్టా ఇప్పించండి, చాలు,” అన్నాడు. మానాభిమానాలు విడిచి పెట్టిన కైకేయి, “ఇదుగో, నారబట్టలు తెస్తున్నాను” అంటూ వచ్చింది. 

రామలక్ష్మణులు తమ మేలి వస్త్రాలు విప్పేసి, తండ్రి ఎదటనే నారబట్టలు ధరించారు. సీతకు మాత్రం అవి ఎలా కట్టుకోవాలో తెలియక రాముడి కేసి చూసింది. తరవాత ఒక బట్ట మెడకు చుట్టుకుని, మరొకటి చేత పట్టుకుని, సిగ్గుతో తల వంచి నిలబడింది. అప్పుడు రాముడు చప్పున ఆమె వద్దకు వెళ్ళి, ఆమె చేతిలో ఉన్న నార చీరె తీసుకుని, ఆమె కట్టుకుని ఉన్న పట్టు చీరె పైన దానిని చుట్టాడు.

ఇది చూసి దశరథుడి భార్యలు కన్నీరు కారుస్తూ, “నాయనా, నీవు తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళదలిచావు, వద్దన్నా మానవు. కాని సీతను కూడా ఎందుకు తీసుకు పోతావు? ఆమె వనవాసం చెయ్య లేదు. మా వద్ద విడిచి పెట్టి వెళ్ళు, నాయనా. నీకు బదులుగా ఆమెను చూసుకుంటూ ఉంటాం,” అన్నారు.

ఈ లోపల వసిష్టుడు సీతకు నార చీరె లిస్తున్న కైకేయితో “గుణ హీనురాలా, నీ సాహసానికి అంతు లేకుండా ఉన్నదే. సీత అడవికి వెళ్ళవలసిన అవసరమే మున్నది? రాముడి కోసం సిద్ధం చేసిన పట్టాభిషేకం ఆమెకు జరిపి రాజ్యం పాలించేటట్టు చేయవచ్చు, తెలుసా? సీత ఈ నార చీరెలు కట్టవలసిన అవసరం లేదు సరే కదా, ఆమె తన వెంట వాహనాలూ, వస్తువులూ, బట్టలూ, పరిచారికలూ, సమస్తమూ తీసుకు పోవచ్చును.”

“భరతుడు సంతోషిస్తాడని నీవు చేసిన ఈ దుర్మార్గం అతనికి ఎంత మాత్రమూ రుచించదు. అతను దశరథుడి కొడుకే అయితే, తన తండ్రి వ్యథకు కారణమైన రామ వనవాసానికి ఎంత మాత్రమూ సమ్మతించడు” అన్నాడు.

చుట్టూ ఉన్నవారు, “ఛీ, ఛీ!” అను కోవటం దశరథుడు విన్నాడు. ఆయన సీతను చూసి, “సుకుమారి, చిన్న పిల్ల! ఆ సీత ముని పత్నిలాగా నార చీరే గట్టి ఎలా వెలవెల పోతున్నదో చూడండి! ఆమె నార చీరెలు కట్టటానికి వీల్లేదు,” అన్నాడు. రాముడు బయలు దేరే ప్రయత్నంలో తండ్రికి అప్పగింతలు చెప్పి, తన తల్లి అయిన కౌసల్యను కాపాడమని కోరాడు. దశరథుడు సుమంత్రుడితో, “మంచి గుర్రాలను పూన్చిన మేలైన రథంలో వీళ్ళ నెక్కించి, నగరం బయట అరణ్యంలో విడిచి పెట్టారా” అన్నాడు. ధనాధికారిని పిలిచి, “పధ్నాలుగేళ్ళ పాటు సీతకు సరి పోయే మేలైన చీరెలు, నగలూ తీసుకురా,” అని ఆజ్ఞాపించాడు. 

సీత పెళ్ళికి పోతున్న దానిలాగా వికసించిన ముఖంతో తనకోసం తెచ్చిన నగలు పెట్టుకుంటూంటే కౌసల్య ఆమెను రెండు చేతులా ఆలింగనం చేసుకుని, “సీతా, నీ భర్త పేదవాడై పోయినాడని వనవాస కాలంలో ఆశ్రద్ధగా చూడకమ్మా” అంటూ నీతిబోధ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *