శత్రుఘ్నుడు లవణుడిని సంహరించాటానికి వెల్లుట

మర్నాడు రాముడు కొలువుతీరి ఉండగా, ఒక కుక్కవచ్చి బయట మొరిగింది. లక్ష్మణుడు, ఆ కుక్క రాజుతో ఏదో ఫిర్యాదు చెయ్యగోరుతున్నదని తెలుసుకుని, దాన్ని సభలోకి తీసుకువచ్చాడు. తల పగిలి ఉన్న ఆ కుక్కను చూసి రాముడు, “నీకు కలిగిన కష్టం గురించి నాతో నిర్భయంగా చెప్పు,” అన్నాడు.

“సర్వార్థసిద్ధి అనే భిక్షువు నా తల పగలగొట్టాడు. నేనతనికే అపకారమూ చెయ్యలేదు,” అన్నది కుక్క.

రాముడు వెంటనే ఆ భిక్షువును పిలిపించి, “నీవీకుక్క తల ఎందుకు పగలగొట్టావు? అది నీకేమపకారం చేసింది?” అని అడిగాడు.

“రాజా, నేను భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతున్నాను. నాకెక్కడా భిక్ష దొరకలేదు. ఈ స్థితిలో ఈ కుక్క నా దారికి అడ్డంగా నిలబడి, ఎంత అదిలించినా పోలేదు. కోపం అణుచుకోలేక దాన్ని తలమీద కొట్టిన మాట నిజమే. దానికేమి దండన విధిస్తారో విధించండి,” అన్నాడు సర్వార్ధసిద్ధి.

అతనికి ఎలాటి శిక్ష విధిస్తే బాగుంటుందాని రాముడు సభలోని వాళ్ళను అడిగాడు. సభలో ఎందరో పండితులుండి కూడా. ఒక్కరూ సూటిగా సమాధానం చెప్పలేదు.

అప్పుడు కుక్క రాముడితో, “రామా, ఇతనికి నేను చెప్పిన శిక్ష వెయ్యి. కాలంచరమనే చోట కులపతిగా ఇతనికి ఉద్యోగమియ్యి,” అన్నది. రాముడతనికి ఉద్యోగం ఇచ్చి, ఏనుగు మీద ఎక్కించి పంపేశాడు. భిక్షువు కూడా పరమానందం చెంది వెళ్ళిపోయాడు.

తరవాత రాముడూ, మంత్రులూ ఆ కుక్కను,”ఆ భిక్షువుకు ఇలాటి శిక్ష ఎందుకు వేయించావు? దీనికేదో కారణం ఉండాలి,” అన్నారు.

“నేను కిందటి జన్మలో ఆ ఉద్యోగమే చేశాను. ఆ పదవిలో నాకు చక్కని భోజనమూ, దాసదాసీలూ, సమస్తమూ అమరి ఉండేవి. ఎంతో భూతదయ గలిగి,వినయమూ, శీలమూ కలవాడిననిపించుకున్నాను. దేవ బ్రాహ్మణ పూజ చేశాను. అయినప్పటికీ ఆ పదవిలో ఉండిన కారణంగా నాకీ నీచజన్మ కలిగింది. మహాకోపీ, దయారహితుడూ అయిన ఈ భిక్షువు ఆ పదవి నిర్వహించాడో జన్మజన్మలకీ ఘోర నరకంపాలు అయితీరుతాడు,” అన్నది కుక్క.

కుక్క వెళ్ళిపొయ్యాక ఒక గుడ్లగూబా, గద్దా తగాదాపడి తీర్పు చెప్పమని రాముడి వద్దకు వచ్చాయి. ఒక వనంలో ఒక ఇల్లున్నది. ఆ ఇల్లు నాదంటే నాదని రెండు పక్షులూ తగాదా పడుతున్నాయి. ఈ తగాదా తీర్చేటందుకు గాను రాముడు పుష్పక విమానం మీద తన మంత్రులతో సహా ఆ ఇల్లున్న చోటికి వెళ్ళాడు.

“ఈ ఇంటిని నువ్వెప్పుడు కట్టుకున్నావు?” అని రాముడు గద్ద నడిగాడు. “భూమి మీద మనుషులు పుట్టిన కాలంలో నేనీ ఇల్లు కట్టుకున్నాను. ఇది నా ఇల్లే” అన్నది గద్ద. వెంటనే గుడ్లగూబ, “రామా, భూమిమీద చెట్లు ఏర్పడిన కాలంలో నేనీ ఇంటిని కట్టాను,” అన్నది.

వెంటనే రాముడి మంత్రులు ఆ ఇల్లు గుడ్లగూబదేనని తేల్చారు. ఎందుచేతనంటే సృష్టిలో మొదట వచ్చినవి వృక్ష జాతులు. గుడ్లగూబ ఇంటిని కాజెయ్యాలని చూస్తున్నది గనక గద్దను శిక్షిస్తానన్నాడు రాముడు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది.

“రామా, అసలే శాపం తిని ఉన్న ఈ గద్దను ఇంకా ఎందుకు శిక్షిస్తావు? ఈ గద్ద బ్రహ్మదత్తుడనే రాజు, మహాధనికుడు, శూరుడు, సత్యవ్రతుడు. ఇతని ఇంటికి గౌతముడు వచ్చి అతిథిగా ఉన్నాడు. గౌతముడికి రాజు స్వయంగానే అర్ఘ్యపాద్యాలిచ్చాడు. గౌతముడు బ్రహ్మదత్తుడి ఆతిథ్యం స్వీకరిస్తున్న సమయంలో ఒకనాడు ఆయన భోజనంలోకి పొరపాటున మాంసం వచ్చింది. అది చూసి గౌతముడు కోపించి, రాజును గద్దవుకమ్మని శపించాడు. ఆ తరవాత, ఇక్ష్వాకు వంశంలో పుట్టే రాముడు తాకినప్పుడు శాపవిముక్తి కలుగుతుందని కూడా గౌతముడన్నాడు.”

ఆకాశవాణి పలికిన ఈ మాటలు విని రాముడా గద్దను తాకాడు. వెంటనే గద్ద ఒక దివ్యపురుషుడుగా మారింది. ఆ పురుషుడు రాముడికి కృతజ్ఞత తెలుపుకుని వెళ్ళిపోయాడు.

యమునాతీర వాసులైన మునులు నూరుమందికిపైగా రాముడి దర్శనార్థం ఒకనాడు వచ్చారు. వారు కలశాలతో తెచ్చిన నీరూ, పళ్ళూ మొదలైన కానుకలు స్వీకరించి, వారందరినీ సుఖాసీనులను చేసి రాముడు, వారు వచ్చిన పని అడిగాడు. లవణాసురుడనేవాడు తమని మహాబాధ పెడుతున్నాడనీ, వాడి బాధ నుంచి విముక్తి కలిగించమని మునులు రాముణ్ణి కోరారు. ఈ లవణాసురుడనేవాడు మధువనే రాక్షసుడి కొడుకు. మధువు రుద్రుణ్ణి గురించి బహుదీర్ఘమైన తపస్సు చేసి, ఆయనను మెప్పించాడు. దాని ఫలితంగా రుద్రుడు తన త్రిశూలంలో నుంచి మరొక త్రిశూలం చేసి మధువు కిస్తూ, “అది వెంట ఉన్నంత కాలమూ నిన్నెవరూ జయించలేరు.” అని చెప్పాడు. ఆ త్రిశూలాన్ని వంశ పరంపరగా తన ఇంటనే ఉండేటట్టు అనుగ్రహించమని మధువు శివుణ్ణి వేడుకున్నాడు. “నీ అనంతరం ఈ త్రిశూలం నీ కొడుక్కు మాత్రమే ఉంటుంది. అటు పైన ఉండదు,” అన్నాడు శివుడు. ఆ మధువు రావణుడికి చెల్లెలు వరస అయిన కుంభీనసను పెళ్ళాడాడు. వారికి లవణుడు పుట్టాడు. వాడు పసితనం నుంచి మహాపాపి, వాణ్ణి మంచిదారిన పెట్టటం మధువు వల్ల కాలేదు. మధువు వరుణలోకానికి వెళ్ళిపోతూ, శివుడు తన కిచ్చిన త్రిశూలాన్ని లవణుడి కిచ్చాడు. దాని అద్భుతశక్తి నెరిగిన లవణుడు మరింత విజృంభించి, అందరినీ బాధిస్తున్నాడు, మునులను మరింత వేపుకుతింటున్నాడు.

మునులు చెప్పిన విషయాలన్నీ ఆలకించి రాముడు వారితో, ” లవణాసురుణ్ణి నేను చంపిస్తాను. మీరు నిర్భయంగా ఉండండి,” అని అభయమిచ్చాడు. తరువాత అతను తన తమ్ములను చూసి, “లవణాసురుణ్ణి చంపేపనికి ఎవరు పూనుకుంటారు?” అని అడిగాడు.

భరతుడు తానా పని చేస్తానన్నాడు. కాని శత్రుఘ్నుడు భరతుడి పైన పోటీకి వచ్చి, తానే లవణాసురుణ్ణి చంపుతాననీ, తానుండగా భరతుడు శ్రమపడటం భావ్యం కాదనీ, పడవలసిన శ్రమలన్నీ భరతుడు లోగడ నందిగ్రామంలో ఉన్నప్పుడే పడ్డాడనీ అన్నాడు.

రాముడందుకు ఒప్పుకుని శత్రుఘ్నుణ్ణి మధుపురానికి రాజుగా అభిషేకించే ఏర్పాట్లు చేశాడు. ఒక రాజు చచ్చిపోతే మరొకడు వెంటనే రాజ్యభారం వహించటానికి సిద్ధంగా ఉండాలి. శత్రుఘ్నుడి రాజ్యాభిషేకోత్సవం ముగియగానే రాముడు అతనికొక బాణం ఇచ్చి, ఇలా చెప్పాడు. “ఈ బాణం. మధుకైటభులను చంపినది. దీన్ని నేను రావణుడి పైన కూడా ప్రయోగించలేదు. దీనితో నీవు లవణాసురుణ్ణి చంపు. మరొక సంగతి. లవణుడి వద్ద శివుడి త్రిశూలానికి సమమైన శూలం ఉన్నది. అది వాడి చేతిలో ఉండగా ఎవరూ వాణ్ణి జయించలేరు. అందుచేత నీవేం చేస్తావంటే లవణుడి త్రిశూలం వాడి ఇంటనే ఉంటుంది. వాడు నగరం వదిలి ఎటైనా వెళ్ళి ఉన్న సమయంలో నీవు నగరద్వారం ముట్టడించి, వాడు తిరిగి వచ్చినప్పుడు ద్వారం వద్దనే అటకాయించి చంపు. ఏ పరిస్థితిలోనూ వాడు నగరంలోకి వెళ్ళరాదు, త్రిశూలం వాడి చేతికి చిక్కరాదు.”

అంతేకాదు శత్రుఘ్నుడు ముందుగా సేనను పంపి, తరవాత తాను ఒంటరిగా వెళ్ళాలి. తనను చంపటానికెవరో వస్తున్నట్టు లవణుడికి తెలియగూడదు. గ్రీష్మర్తువులోనే సేనలు గంగ అవతలి ఒడ్డు చేరి అక్కడ విడియాలి. శత్రుఘ్నుడు వర్షాకాలారంభంలో విల్లు బాణాలు తీసుకుని బయలుదేరి వెళ్ళి లవణాసురుణ్ణి చంపాలి. ఈవిధంగా రాముడు యుద్ధగతి నిర్ణయించాడు.

ఆ ప్రకారమే శత్రుఘ్నుడు ముందుగా తన సేనలను పంపి, ఒకమాసం గడిచాక తాను బయలుదేరాడు. దారిలో రెండు రోజులపాటు అతను వాల్మీకి ఆశ్రమంలో నిలిచాడు. వాల్మీకి అతనికి ఆతిథ్య మిచ్చి, ఆ ఆశ్రమం ఒకప్పుడు రఘువంశం వారిదేనంటూ దాని కథ ఇలా చెప్పాడు:

రఘు వంశంలో ఒకప్పుడు సుదాసు అనేవాడుండేవాడు. ఆయన కొడుకు వీరసహుడు. చిన్నతనంలోనే వేటకు వెళ్ళి, వనంలో ఇద్దరు రాక్షసులను చూశాడు. ఆ రాక్షసులు పులుల రూపంలో తిరుగుతూ, కనిపించిన మృగాన్నెల్లా తినేస్తూ, అరణ్యమంతా పాడుపెట్టేశారు. ఎక్కడా ఒక మృగం లేదు. అది చూసి వీరసహుడికి చాలా కోపం వచ్చింది. అతనా రాక్షసులిద్దరినీ చూస్తూనే వారిలో ఒకణ్ణి చంపేశాడు. అప్పుడు రెండోవాడు, ” పాపీ, అకారణంగా నా అనుచరుణ్ణి చంపావుకదూ? నిన్నేం చేస్తానో చూడు,” అంటూ అదృశ్యుడయిపోయాడు.

కొంతకాలం గడిచింది. ఆ రాజు ఇదే ఆశ్రమంలో ఒక బ్రహ్మాండమైన అశ్వమేధ యాగం చేశాడు. వసిష్ఠుడే ఆ యాగం చేయించాడు. యాగం పూర్తి అయేసరికి వెనకటి రాక్షసుడు, రాజుపైన పగబట్టి ఉన్నవాడు గనక, వసిష్ఠుడి రూపంలో వచ్చి, “రాజా యజ్ఞం పూర్తి అయింది. నాకు చక్కని మాంసభోజనం పెట్టు,” అని అడిగాడు.

రాజు సంతోషించి వంటవాణ్ణి పిలిచి, “గురువుగారికి హవిస్సు మాంసంతో రుచిగా భోజనం తయారుచెయ్యి.” అన్నాడు. ఈ లోపుగానే రాక్షసుడు వంటవాడి రూపంలో నరమాంసంతో వంట సిద్ధం చేసి, రాజుకు చూపించి, ” హవిస్సుతో చక్కని వంట చేశాను,” అన్నాడు. రాజు వసిష్ఠుడికి తన భార్య అయిన మదయంతి చేత ఆ నరమాంసం వడ్డింపించాడు. వసిష్ఠుడు తనకు వడ్డించినది నరమాంసమని గుర్తించి, ఆగ్రహించి, “నువు నర భక్షకుడి వైపో !” అని రాజును ఘోరంగా శపించాడు.

రాజుకు కూడా కోపం వచ్చి, వసిష్ఠుణ్ణి శపించటానికి నీరు చేతిలోకి తీసుకున్నాడు. కాని అతను శపించే లోపుగా మదయంతి అడ్డుపడి, “ఆయన మనకు దేవుడిలాటి వారు. ఆయనను శపించరాదు,” అన్నది. అప్పుడు రాజు చేతిలో నీళ్ళను తన పాదాల మీదనే పోసేసుకున్నాడు. ఆ నీటి వల్ల రాజు పాదాలకు కల్మషం కలిగింది.

అప్పటి నుంచి అతనికి కల్మాషపాదుడనే పేరు వచ్చింది.

తరువాత వసిష్ఠుడు జరిగిన సంగతి గ్రహించి, కల్మాషపాదుడికి శాపఫలం పన్నెండేళ్ళే ఉండేటట్టు అనుగ్రహించాడు. రాజు పన్నెండేళ్ళపాటు నరభక్షకుడుగా జీవించి, శాపం తీరి మామూలు మనిషి అయి, ఎప్పటి లాగే రాజ్యపాలన చేశాడు.

ఈ కథను వాల్మీకి వల్ల విని శత్రుఘ్నుడు పర్ణశాల ప్రవేశించే సమయానికి సీత కవలపిల్లలను కన్నది. ఈ వార్త ముని కుమారుల ద్వారా వినగానే వాల్మీకి వెళ్ళి,బాలచంద్రులాగా ప్రకాశించే పిల్లలను చూసి, రక్షలు కట్టి, పెద్దవాడికి కుశుడనీ రెండోవాడికి లవుడనీ పేర్లు పెట్టాడు.

ఇది జరిగింది. సరిగా అర్థరాత్రి వేళ. ఆ సమయంలోనే శత్రుఘ్నుడు సీత వద్దకు వెళ్ళి, “అమ్మా, అదృష్టం,” అని ఎంతో సంతోషించాడు. మర్నాడు అతను వాల్మీకి వద్ద సెలవు పుచ్చుకుని, పడమరగా ప్రయాణిస్తూ, ఏడు రోజులకు యమునాతీరం చేరి, అక్కడి మునుల ఆశ్రమాలలో సత్కాలక్షేపం చేస్తూ ఆ రాత్రి గడిపాడు.

మర్నాడు తెల్లవారగానే శత్రుఘ్నుడు చ్యవనమహామునిని లవణాసురుణ్ణి గురించి, వాడి త్రిశూలం గురించి అడిగాడు.

వాడా శూలంతో ఎన్నో దారుణాలు చేశాడని చెబుతూ చ్యవనుడు మాంధాత వృత్తాంతం వివరించి చెప్పాడు.

అయోధ్య రాజైన యువనాశ్వుడి కుమారుడు మాంధాత. మహాబలవంతుడైన ఆ మాంధాత భూమిలో ఉండే రాజులనందరినీ జయించి, స్వర్గానికి వెళ్ళి దాన్ని కూడా జయించ నిశ్చయించాడు. ఆ సంగతి తెలిసి, ఇంద్రుడు మొదలైన దేవతలు భయపడ్డారు. ఇంద్రుడి అర్థాసనము, దేవతల సేవా కోరి వచ్చిన మాంధాతతో ఇంద్రుడు మంచిగానే, “ముందు భూలోకాన్ని జయించి రా, అప్పుడు దేవలోకాన్ని నీ కిచ్చేస్తాం,” అన్నాడు.

“అదేమిటి? భూలోకమంతా అదివరకే జయించాను. అక్కడ నా శాసనానికి ఎదురులేదు,” అన్నాడు మాంధాత..

“మధువనంలో లవణాసురుడనేవాడున్నాడు. వాడు నీకు లోబడి నడుచుకుంటున్నాడా?” అని ఇంద్రుడు మాంధాత నడిగాడు. మాంధాత సిగ్గుపడి తల వంచుకుని భూమికి తిరిగి వచ్చి, లవణుణ్ణి జయించటానికి సేనా సమేతుడై బయలుదేరి వెళ్ళి, తనకు లొంగిపొమ్మని దూతద్వారా లవణుడికి కబురు చేశాడు. లవణుడా దూతను పట్టుకుని తినేశాడు.

ఎంత కాలానికి దూత తిరిగి రాకపోగా మాంధాత లవణుడిపైన యుద్ధం ప్రారంభించాడు. లవణుడు మాంధాతను చూసి నవ్వి, తన శూలాన్ని ప్రయోగించే సరికి, అది మాంధాతతో సహా అతని సైన్యమంతటినీ భస్మం చేసేసింది.

చ్యవనుడీ సంగతి చెప్పి, “వాడి చేతిలో ఆ త్రిశూలం లేని సమయంలోనే నువు వాణ్ణి చంపాలి. రేపే ఆ పని చెయ్య గలుగుతావు,” అన్నాడు. ఆ రాత్రి కబుర్లతో సులువుగా గడిచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *