రాముడు ఆశ్వమేధయాగం చేయుటకు సంకల్పించుట

రాముడు శంబూకుణ్ణి చంపి, అయోధ్యకు తిరిగి వస్తూనే, ద్వారపాలకుడితో భరత లక్ష్మణులను తన వద్దకు పంపమని చెప్పాడు. వారు త్వరలోనే రాముడి వద్దకు వచ్చారు. వారితో రాముడు,” తమ్ములూ, అన్ని పాపాలను పోగొట్టే రాజసూయం చేద్దామనుకుంటున్నాను. పూర్వం మిత్రుడు, చంద్రుడు రాజసూయం చేసే శాశ్వతమైన కీర్తి గడించారు. అందుకు మీ సలహా ఏమిటి?” అని అడిగాడు.

దానికి భరతుడు, “అన్నా, నీ ధర్మానికి,కీర్తికి లోటేమున్నది. రాజసూయం చేశావంటే అనేక రాజవంశాలు నాశనమవుతాయి, పౌరుషం కొద్ది అనేకమంది రాజులు నశిస్తారు. అందుచేత రాజసూయం చేసి,భూమికి లేనిపోని సంక్షోభం కలిగించవద్దు,” అన్నాడు.

భరతుడన్న మాట రాముడికి నచ్చింది. మంచి సలహా ఇచ్చినందు కతను భరతుణ్ణి మెచ్చుకున్నాడు.

అప్పుడు లక్ష్మణుడిలా అన్నాడు.. “అన్నా, సమస్త పాపాలనూ పోగొట్టే మహాయజ్ఞం అశ్వమేధం. వెనక ఇంద్రుడు తనకు మహాపాతకం చుట్టుకోగా, బృహస్పతి సహాయంతో, అశ్వమేధం ద్వారా ఆ పాపాన్ని పోగొట్టుకున్నాడు.”

లక్ష్మణుడా వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు. పూర్వం వృత్రుడనే గొప్ప రాక్షసుడుండేవాడు. అతను మహాధర్మపరుడు, గొప్పజ్ఞాని; మూడు లోకాలనూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ, ధర్మం తప్పకుండా పాలించాడు. అతని పాలనలో భూమి అన్ని కోరికలనూ తీర్చేది, దున్నకుండానే పండేది, పూలూ, పళ్ళూ, కాయలు రసవంతంగా ఉండేవి.

ఇలా ఉండగా వృత్రుడికి తపస్సు చేయాలని సంకల్పం కలిగింది. అతను తన పెద్దకొడుక్కు రాజ్యం అప్పగించి ఉగ్రమైన తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సు చూసి దేవేంద్రుడు బెదిరిపోయాడు. అతను విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, ” వృత్రుడు అదివరకే మూడు లోకాలనూ జయించాడు. ఇప్పుడు తపస్సు కూడా ప్రారంభించాడు. ఈ తపస్సు పూర్తి అయిందంటే లోకాలుండేటంత కాలమూ అతన్ని నేను జయించలేను. అందుచేత నువు ఆ వృత్రుణ్ణి కడతేర్చితే గాని నాకూ, దేవతలకూ దిక్కులేదు,” అన్నాడు.

దేవతల పక్షాన ఇంద్రుడిలా మొరపెట్టుకోగా, విష్ణుమూర్తి, “మహాత్ముడైన వృత్రుడు నాకు స్నేహితుడు. అందుచేత నేనతన్ని చంపను. అయితే నీ కోరిక కూడా తీసివెయ్యటానికి లేదు. అందుకని వృత్రుడు చచ్చే ఉపాయం ఒకటి చేస్తాను. నా శక్తిని మూడు భాగాలు చేసి, ఒకభాగం నీలోనూ, ఒకటి వజ్రాయుధంలోనూ, మూడవదాన్ని భూమిలోనూ, ప్రవేశపెడతాను. అప్పుడు నువ్వు వృత్రుణ్ణి చంపగలుగుతావు,” అన్నాడు.

ఈ మాటలు విని ఇంద్రుడూ, దేవతలూ సంతోషించి, వృత్రుడు. తపస్సు చేసుకునే వనానికి వెళ్ళారు. తపశ్శక్తి చేత మూడులోకాలనూ దహించేటట్టుగా వెలిగిపోతూ వృత్రుడు వారికి కనిపించాడు. అతన్ని చూస్తేనే దేవతలకు దడపుట్టింది. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని రెండు చేతులాపట్టి వృత్రుడి తలను తెగవేశాడు..

వెంటనే బ్రహ్మహత్య ఇంద్రుడి శరీరాన్ని చుట్టుకున్నది. అతనికి తీరనీ దుఃఖం పుట్టుకొచ్చింది. అప్పుడు దేవతలు విష్ణువుతో, “దేవా, నువ్వేమో వృత్రుణ్ణి చంపావు, బ్రహ్మహత్య ఇంద్రుణ్ణి చుట్టుకున్నది. అది వదిలే ఉపాయం చెప్పు”. అని మొరపెట్టుకున్నారు.

“ఇంద్రుడు అశ్వమేధం చేసినట్టయితే బ్రహ్మహత్య తొలగిపోయి అతడు ఎప్పటి దేవేంద్రుడవుతాడు,” అని విష్ణుమూర్తి దేవతలకు చెప్పాడు.

ఈ సలహా విని దేవతలు బృహస్పతి మొదలైన మునులను వెంటబెట్టుకుని ఇంద్రుడున్న చోటికి వెళ్ళారు. ఇంద్రుడు తెలివి పూర్తిగా పోయి, భయభ్రాంతుడై ఒక చోట పడి ఉన్నాడు. ఆ ఇంద్రుణ్ణి వెంట ఉంచుకుని దేవతలు ఆశ్వమేధయాగం చేసిన మీదట, అతన్ని బ్రహ్మహత్య వదలిపోయింది.

లక్ష్మణుడీ కథ చెప్పిన మీదట రాముడు అశ్వమేధం యొక్క మహిమను తెలిపే మరొక కథ చెప్పాడు.

పూర్వం కర్దమ ప్రజాపతి కొడుకు ఇలుడు బాహ్లికదేశాన్ని పరిపాలించేవాడు. అతనంటే దేవతలకూ, రాక్షసులకూ, నాగులకు, యక్షులకు గంధర్వులకూ, ఎంతో గౌరవం వుండేది.

ఒక చైత్రమాసంలో ఇలమహారాజు తన పరివారాన్ని వెంటబెట్టుకుని అడవికి వేటకు వెళ్ళాడు. ఎన్ని వేల మృగాలను చంపినా అతనికి వేటతమకం తీరలేదు. అందుచేత అతను వేటాడుతూ పోయి పోయి, కుమార స్వామి పుట్టిన చోటికి వెళ్ళాడు. అక్కడ పార్వతి పరమేశ్వరులూ, వాళ్ళ అనుచరులూ ఉన్నారు.

ఆ పర్వత ప్రదేశంలోగల విశేషమేమిటంటే, అక్కడ చెట్లూ, పక్షులూ, జంతువులూ కూడా ఆడవే.

అక్కడికి చేరుతూనే, ఇలుడూ, అతని భృత్యులూ కూడా స్త్రీలుగా మారిపోయారు. తనలో కలిగిన మార్పు చూసి ఇలుడికి బాధా, భయమూ పుట్టాయి. అతను శివుడి దగ్గరకు వెళ్ళి స్తోత్రం చేసి, కాళ్ళపైన పడి రక్షించమన్నాడు.

“నీ ఆడతనం పోగొట్టటం తప్ప ఇంకేమైనా కోరుకో” అన్నాడు శివుడు.

ఇలుడు శివుణ్ణి మరొక వరమేదీ కోరక పార్వతిని ప్రార్థించాడు. పార్వతి అతనిపై జాలిపడి, అతను ఒక నెల స్త్రీగానూ, మరొక నెల పురుషుడుగానూ ఉండేటట్టూ, స్త్రీగా ఉండేటప్పుడు జరిగేది పురుషుడుగా ఉండేటప్పుడు జ్ఞాపకం లేకుండానూ వరమిచ్చింది.

ఇలుడు కాస్తా ఇలగా మారింది. అతని సైనికులందరూ స్త్రీలే అయారు. వారందరూ యథెచ్చగా ఆ అడవిలో తిరగసాగారు.

వాళ్ళు స్త్రీలుగా మారిన కొండకు సమీపంలోనే ఒక సరస్సున్నది. అక్కడనే చంద్రుడి కొడుకైన బుధుడు ఆశ్రమం కల్పించుకుని, తపస్సు చేసుకుంటున్నాడు. అతను మంచి యౌవనంలో ఉండి, ఆకర్షణీయంగా ఉన్నాడు.

ఇల, ఆమె వెంట ఉన్న స్త్రీలూ సరస్సులో దిగి, దాన్ని కల్లోలం చెయ్యసాగారు. బుధుడు వారిని చూసి, ఇల సౌందర్యం చేత సమ్మోహితుడయాడు. అంత అందమైన స్త్రీ మూడులోకాలలోనూ మరొకతె ఉండదని అతనికి తోచింది. ఇల వెంట ఉన్న స్త్రీలను కొందరిని అతను ఆశ్రమంలోకి పిలిచి, “ఆమె ఎవరు? ఈ ప్రాంతానికి ఏం పనిమీద వచ్చింది ? నిజం చెప్పండి,” అన్నాడు.

“అయ్యా, ఆమె మాకు నాయకురాలు.ఆమెకు భర్తలేడు. మమ్మల్ని వెంటపెట్టుకుని ఇలా అరణ్యమంతా తిరుగుతున్నది,” అన్నారా స్త్రీలు.

“మీరంతా ఈ ఆశ్రమంలోనే కంద మూలాలు తింటూ ఉండిపొండి. ఇక్కడ ఉండే కింపురుషులు మీకు భర్తలౌతారు,” అని బుధుడు వారితో అన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు.

తరవాత బుధుడు ఇలతో, “నేను చంద్రుడి కొడుకును. నా పేరు బుధుడు. నన్ను భక్తి స్నేహాలతో చూసుకుంటూ ఇక్కడే ఉండిపో,” అన్నాడు.”నీ యిష్టం,” అన్నది ఇల.

ఇద్దరూ మహాసంతోషంగా ఆ నెల గడిపారు. ఒకనాడు ఉదయం ఇల కాస్తా, అలమహారాజై పక్కమీది నుంచి ‘ లేచాడు. అతనికి జరిగిన దేదీ జ్ఞాపకం లేదు. సరస్సులో బుధుడు చేతులు పైకెత్తి తపస్సు చేసుకుంటున్నాడు. ఇలుడతన్ని చూసి, “అయ్యా, నేను నా సైనికులతో ఈ పర్వత ప్రాంతానికి వేటకై వచ్చాను. వారంతా ఎటు పోయారో తెలియకుండా ఉన్నది,” అన్నాడు.

“రాజా, రాళ్ళవాన కురిసి, నీ పరివారమంతా నశించింది. నువు మాత్రం ఈ ఆశ్రమంలో తలదాచుకున్నావు. విచారించకు. ఇక్కడ నువు సుఖంగా ఉండవచ్చు,” అన్నాడు బుధుడు.

ఇలుడు తన అనుచరులు పోయినందుకు దిగులుపడుతూ, “నా కింక రాజ్యం ఏలాలని లేదు. మీరు అనుమతిస్తే నేను నా పెద్ద కొడుకైన శశిబిందుడికి పట్టం కట్టి, వెంటనే తిరిగి వస్తాను.” అన్నాడు.

” అలమహారాజా, ఎందుకలా కలవరపడతావు? ఒక్క సంవత్సరం ఇక్కడ ఉండు. నీకు మేలు కలిగేటట్టు చేస్తాను.” అన్నాడు బుధుడు. ఇలుడు సరేనన్నాడు.ఒక నెలపాటు స్త్రీగా ఉండి మరొక నెలపాటు పురుషుడుగా ఉంటూ ఇలుడు తాను స్త్రీగా ఉన్న సమయంలో బుధుడికి ఒక కొడుకును కన్నాడు.

అటు తరవాత బుధుడు సంవర్తుణ్ణి, చ్యవనుణ్ణి, ప్రమోదనుణ్ణి, దుర్వాసుడు మొదలుగా గల ఇతర ఋషులనూ పిలిపించి, వారికి ఇలుణ్ణి పరిచయం చేసి, అతని పరిస్థితి యధాప్రకారం అయేటందు ఏమైనా దారి చెప్పమన్నాడు. ఈ సమయంలోనే ఇలుడి తండ్రి అయిన కర్దముడూ,మరికొందరు ఋషులూ కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఇలుడికి తలా ఒక సలహా ఇచ్చారు. కాని కర్దముడు, తన కొడుక్కు మేలు కలగాలంటే, అశ్వమేధ యాగం చెయ్యటమే మార్గమన్నాడు. ఆయన సలహా ప్రకారం అందరూ చేరి అశ్వమేధయాగం చేసి, ఇలమహారాజుకు స్థిత్వం లేకుండా చేశారు. యజ్ఞం పూర్తి అయే సమయానికి శివుడే ప్రత్యక్షమై ఇల మహారాజును అనుగ్రహించాడు.

తరువాత ఇలుడు బాహ్లికదేశానికి తిరిగి వెళ్ళక, మధ్యదేశంలోని ప్రతిష్టానపురాన్ని ఏలుతూ, అక్కడే ఉండిపోయాడు. అతని కొడుకు శశిబిందుడు బాహ్లికదేశాన్ని పాలించాడు. ఇలకూ బుధుడికీ పుట్టిన పురూరవనుడు అలమహారాజు అనంతరం ప్రతిష్టాన పురానికి రాజయాడు.

రాము డి కథ తన తమ్ములకు చెప్పి, లక్ష్మణుణ్ణి పంపి, తన పురోహితులైన వసిష్ఠ, వామదేవ, జాబాలి మొదలైన వారిని రప్పించి, తాను అశ్వమేధం తలపెట్టిన సంగతి వారికి తెలియజేశాడు. వారు చాలా సంతోషించారు.

అశ్వమేధానికి అవసరమైన ప్రయత్నాలు వెంటనే ప్రారంభమై చాలా చురుకుగాసాగాయి.

సపరివారంగా బయలుదేరి రావలిసిందనీ, యజ్ఞోత్సవంలో పాల్గొన వలిసిందనీ, లక్ష్మణుడు కిష్కింధలో సుగ్రీవుడికి, లంకలో విభీషణుడికీ దూతల ద్వారా ఆహ్వానాలు పంపాడు. రాముడి మంచికోరే రాజులందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. నానా దేశాల బ్రాహ్మణులూ, ఋషులూ, సకుటుంబంగా గృహస్థులూ, గాయకులూ, నటులూ, నర్తకులూ ఆహ్వానించబడ్డారు.

నైమిశవనంలో గోమతీ నదీతీరాన యజ్ఞశాల నిర్మించబడింది. వేలకొద్ది బళ్ళతో ధాన్యమూ, అపరధాన్యాలూ, ఉప్పూ, గంధమూ చేరాయి. కోట్లకొద్దీ బంగారం వచ్చింది. వంటవాళ్ళూ, శిల్పులూ వచ్చారు. రాముడి అంతఃపురం నుంచి అతని తల్లులూ, బంగారు సీతా భరతుడి వెంట వచ్చి యజ్ఞం జరిగే చోటికి చేరారు. అహ్వానితులకు విడుదులు వేరువేరుగా ఏర్పాటు చేయబడ్డాయి.

ఈ ఏర్పాట్లన్నీ అయే లోపల రాముడు ఒక నల్లని గుర్రాన్ని విడిచి, దాని వెంట ఋత్విజులనూ, లక్ష్మణుణ్ణి పంపాడు.

యజ్ఞం చూడవచ్చిన రాజులు రాముడికి కానుకలు తెచ్చారు. వారి సౌకర్యాలను భరతశత్రుఘ్నులు చూశారు. బ్రాహ్మణుల సౌకర్యాలను సుగ్రీవుడి వానరులూ, ఋషుల సౌకర్యాలను విభీషణుడి రాక్షసులూ చూశారు.

యజ్ఞం చాలా జయప్రదంగా జరిగింది. ఎక్కడా, ఎవరికీ, ఏ లోటూ కలిగిందన్న మాట పుట్టలేదు. భోజనాల దగ్గర ఎవరూ నోరు తెరిచి అడగకుండానే కావలిసిన పదార్థాలు వడ్డన అయాయి. బంగారమేమిటి, ధనమేమిటి, రత్నాలేమిటి, బట్టలేమిటి, ఎవరేమి కోరినా ఇచ్చారు. ఈ వస్తువులన్నీ పెద్దపెద్ద కుప్పలుపోసి, రాత్రి, పగలూ కూడా అడిగినవారికి ఇస్తూనే వచ్చారు. అలాటి యజ్ఞాన్ని ఇంద్రుడూ, కుబేరుడూ, యముడూ కూడా చేసి ఉండ లేదని చెప్పుకున్నారు. వానరులకూ, రాక్షసులకు చేతినిండా పనిపడింది. యాచకులు కోరినదల్లా వారే ఇస్తూవచ్చారు. ఇదేవిధంగా ఏడాది గడిచి యజ్ఞం పూర్తి అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *