హనుమంతుడు రామునికి సీత సమాచారం తెలుపుట

లంక అంతా పరశురామ ప్రీతి చేసిన హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీత వద్దకు తిరిగి వచ్చి, ఆమెకు నమస్కారం చేసి, ” నా అదృష్టం చేత నీకేమీ అపాయం కలగలేదు. రాముడు త్వరలోనే వానరులనూ, భల్లూకాలను వెంట బెట్టుకుని వస్తాడు. నాకు సెలవిప్పించు,” అన్నాడు.

అతను ఆమె వద్ద సెలవు పుచ్చుకుని అరిష్టమనే పర్వతం పైకి ఎక్కి సముద్రం పైకి చూసి తన శరీరాన్ని పెంచాడు. అతను ఒక్కసారి బలంగా తొక్కగానే ఆ పర్వతం లోని శిలలు పిండి అయాయి; అందులో ఉండే మృగాలన్నీ భయపడి చెల్లాచెదరుగా పరిగెత్తాయి. హనుమంతుడు అవతలి ఒడ్డుకు ప్రయాణమైనవాడై ఆకాశంలోకి లేచాడు.

అతను మేఘాల మధ్య కనిపిస్తూ, మాయమవుతూ, సముద్రంలో వెళ్ళే ఓడలాగా గాలిలో తేలిపోతూ, సముద్రాన్ని లంఘించాడు. త్వరలోనే అతనికి అంతదూరాన మహేంద్ర పర్వతం కనబడింది. దాన్ని చూస్తూనే అతను ఉత్సాహంతో గట్టిగా సింహనాదం చేశాడు.

హనుమంతు డెప్పుడు వస్తాడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్న అంగదుడు మొదలుగాగల వానరులకు ఆ సింహనాదం విని పరమానందమయింది. అందరికి పెద్ద వాడయిన జాంబవంతుడు వానరులందరినీ చేరదీసి, ” మన హనుమంతుడు పని చక్కబెట్టుకుని మరీ వస్తున్నాడు. అతని కంఠధ్వని వింటే అలాగే తోస్తున్నది,” అన్నాడు.

వానరులు ఆనందంతో కుప్పి గంతులు వేశారు. కొందరు హనుమంతుణ్ణి చూడటానికి చెట్లెక్కి, అతన్ని పిలుస్తున్నట్టుగా కొమ్మ లాడించారు. అంతలోనే హను మంతుడు వచ్చి మహేంద్రపర్వతం మీద దిగాడు. వానరులంతా అమితోత్సాహంతో ఆతన్ని చుట్టు ముట్టారు. అతనికి పళ్ళూ, దుంపలూ అందించారు.

హనుమంతుడు జాంబవంతుడిలాటి పెద్దలకూ, యువరాజైన అంగదుడికి నమస్కారాలు చేసి, “చూశాను సీతను,” అని స్పష్టంగా చెప్పేశాడు. అతను అంగదుణ్ణి ఆలింగనం చేసుకుని, అందరూ కూర్చోవటానికి మహేంద్రగిరి పైన ఒక సుందర స్థలం చూశాడు.

హనుమంతుడు సీతను చూశానన్న శుభవార్త చెప్పగానే వానరులు కొందరు సింహనాదాలు చేశారు. కొందరు కేకలుపెడితే మరి కొందరు జవాబులిచ్చారు, ఇంకొందరు రాళ్ళమీదుగా దూకుతూ, అతణ్ణి తాకారు.

అప్పుడు అంగదుడు, “హనుమంతుడా, నూరు యోజనాల సముద్రాన్ని అటూఇటూ కూడా దాటి నీకు సాటి లేడనిపించావు. మా అందరి మానాన్నీ కాపాడావు. అంతేకాదు, ‘ సీతాదేవిని కూడా చూశావు,” అన్నాడు. హనుమంతుడు చెప్పబోయే విశేషాలు వినటానికి వానరులందరూ ఆత్రంగా ఉన్నారు. జాంబవంతుడు హనుమంతుడితో, “సీత నీకెలా కనపడింది? ఆమె అక్కడ ఎలా ఉన్నది? ఆమె పట్ల రావణుడెలా ప్రవర్తిస్తున్నాడు? ఉన్న సమాచారమంతా దాచకుండా చెప్పు. అందులో రాముడికి చెప్పవలసినదేదో చెప్పగూడనిదేదో మనం తరవాత తేల్చుకుందాం,” అన్నాడు.

హనుమంతు డీ విధంగా చెప్పసాగాడు: “నేను బయలుదేరటం మీరు చూశారు గదా. కొంతదూరం వెళ్ళేసరికి ఒక అందమైన బంగారు పర్వత శిఖరం నా దారి కడ్డు తగిలింది. అది నన్ను ప్రేమగా పలక రించి, తాను మైనాకుణ్ణనీ, నా తండ్రి అయిన వాయుదేవుడు తనను ఇంద్రుడి నుంచి కాపాడాడనీ చెప్పింది. మైనాకుడి వద్ద సెలవు పుచ్చుకుని చాలా దూరం వెళ్ళాక సర్వమాత అయిన సురసాదేవి ఎదురై నన్ను మింగుతానన్నది. అంగుళం దేహంతో ఆమె నోట ప్రవేశించి వెంటనే బయటికి వచ్చి దారి పుచ్చుకున్నాను.”

ఈ విధంగా ప్రారంభించి హనుమంతుడు, తాను చీకటిపడ్డాక లంకానగరం ప్రవేశించటమూ, లంకిణిని జయించటమూ, లంక అంతా గాలించిన మీదట అశోకవనంలో ఒక శింశుపా వృక్షం కింద సీత కనిపించటమూ మొదలైన విషయాలన్నీ వివరంగా చెప్పాడు. చివర కతను ఇలా అన్నాడు:

“సీత మహా పతివ్రత అనటానికి సందేహం లేదు. ఆమె రాముడి కొరకే జీవిస్తూ చాలా కష్టాలకు గురి అవుతున్నది. నే నొక్కణ్ణి లంకను బూడిద చేసి వచ్చి నప్పుడు మన మందరమూ కలిసి రావణుడి బలాలన్నిటినీ హతమార్చ లేక పోతామా? మనలో ఎవరు తక్కువ? జాంబవంతుడూ, అంగదుడూ, పనసుడూ, నీలుడూ, అజేయు లైన మైందద్వివిదులూ… ఇందరున్నారు.

మనం రావణుణ్ణి చంపి సీతను రాముడి వద్దకు చేర్చటం బాగుంటుందేమో!”

అంగదుడు హనుమంతుడి మాటను బల పరుస్తూ, ” మనం సీతను చూసి కూడా ఆమెను తీసుకు పోకపోవటం అనుచితం. రాముడి వద్దకు వెళ్ళి, “సీతను చూశాం, కాని తీసుకు రాలేదు” అనటం ఏమీ బాగుండదు. అసలు హనుమంతుడు అక్కడి రాక్షస వీరులందరినీ చంపనే చంపాడు. సీతను తీసుకు రావటం తప్ప మనకు పెద్ద పని కూడా లేదు,” అన్నాడు.

ఈ మాట విని జాంబవంతుడు, “యువ రాజా, నీది చాలా మంచి ఆలోచనే. దీన్ని గురించి రాముడే మంటాడో తెలుసుకుని ఆయన చెయ్యమన్నట్టు చేద్దాం,” అన్నాడు. లౌక్యంగా. దీనికి అంగదుడే గాక మిగిలిన వానర వీరులు కూడా సమ్మతించారు.

తలపెట్టిన పని సానుకూలం కావటమూ, రాముడికి చెప్పవలిసిన సమాచారం ఉండటమూ, యుద్ధంచేసే అవకాశం ఉండటమూ మొదలైన అంశాలతో వానరులు ఉద్రేకోత్సాహాలు చెంది తిరుగుముఖం పట్టారు. వారు గాలిలో ఎగురుతూ మధువనం చేరుకుని, అంగదుడి అనుమతితో అక్కడి చెట్ల మీద ఉన్న తుట్టెల నుంచి తేనె తాగారు, సంతోషం పట్టలేక రకరకాల ఆటలాడారు, కేకలు పెట్టారు, ఒకరి నొకరు తరుముకున్నారు, చెట్ల మీదుగా పరిగెత్తారు.

మధువనానికి రక్షకుడు దధిముఖుడు, సుగ్రీవుడి మేనమామ. వానరులు వనంలోని తేనె అంతా తాగెయ్యటమే గాక, చెట్లన్నీ ధ్వంసం చేసి, పూలన్నీ రాల్చెయ్యటం చూసి మండిపడి అతను వానరులను వనం విడిచి పొమ్మని కేక లేశాడు. వాళ్ళు విని పించుకోలేదు. అతను కొందరిని కొట్టాడు. కొందరితో మంచి మాటలాడాడు. కొందరిని బతిమాలుకున్నాడు. కాని అందరూ అతన్ని పట్టుకుని ఏడిపించుకు తిన్నారు, కొందరతన్ని రక్కి, కొరికారు కూడా.

అంగదుడు హనుమంతుణ్ణి బలపరుస్తూ, ” హనుమంతుడు కూడని పని చెయ్యమన్నా. నేను చేసేస్తాను. అలాటప్పుడు మంచి పని చెయ్యమంటుంటే మానట మెందుకూ!” అన్నాడు. వానరులు అంగదుడి మాటలకు హర్షధ్వానాలు చేశారు. వారు తేనె తాగిన కైపులో చిత్తం వచ్చినట్టు చేశారు. మధు వనంలోని కాపలా వాళ్ళందరినీ కట్టేశారు, పళ్ళన్నీ తినేశారు. కొందరు సింహనాదాలు చేశారు, కొందరు సన్నగా కూశారు, మరి కొందరు పడుకుని నిద్రపోయారు.

మధువన మంతా నాశనమవుతూండటం చూసి దధిముఖుడు తన కాపలా వాళ్ళ నందరినీ కూడగట్టుకుని, చెట్లూ, రాళ్ళూ మొదలైన ఆయుధాలతో అంగదాది వానర వీరులపై తలపడ్డాడు. హనుమంతుడు మొదలుగా గల వారు అతని మీద కలియ బడ్డారు. మత్తులో ఉన్న అంగదుడు, దధిముఖుడు తన తాత అన్న స్ఫురణ కూడా. లేకుండా, అతన్ని పడదోసి ఘోరంగా కుమ్మాడు. దధిముఖుడికి స్పృహ తప్పింది.

కొంత సేపటికి అతను తెలివి తెచ్చుకుని, తన చేతిలో ఉన్న చెట్టుతో తప్పతాగి ఉన్న వానరులను తరిమాడు. తరవాత అతను తన వారితో, “ఏళ్ళందరినీ ఇక్కడే పడి ఉండనివ్వండి. నేను వెళ్ళి సుగ్రీవుడితో జరిగినదంతా చెబుతాను. తరవాత సుగ్రీవుడే వాళ్ళ తలలు తీసేస్తాడు,” అని చెప్పి శీఘ్ర గమనాన సుగ్రీవుడి వద్దకు వెళ్ళాడు..

సుగ్రీవుడు తన మేనమామను చూసి ఆశ్చర్యపడి, “ఏమిటి విశేషం?” అని అడిగాడు. ” మీ నాన్నగారి కాలంలో గాని నీ కాలంలోగాని దేవతలకైనా ప్రవేశింపరాని మధువనాన్ని అంగదుడు మొదలైన వానరులు ధ్వంసం చేసి పెట్టారు. కావలివాళ్ళు. పొమ్మంటే కొట్టారు, తల కిందులుగా వేళ్ళాడ గట్టారు. మధువనంలోని తేనె అంతా తాగేస్తున్నారు,” అని దధిముఖుడు సుగ్రీవుడితో చెప్పాడు.

ఆ సమయంలో లక్ష్మణు డక్కడికి వచ్చి, దధిముఖుణ్ణి చూసి, “ఇతనేమిటో ఫిర్యాదు చేస్తున్నాడు?” అన్నాడు.

“సీతను వెతకటానికి దక్షిణంగా వెళ్ళిన నా వాళ్ళు మధువనానికి వస్తూనే వనమంతా అల్లకల్లోలం చేసి తేనెలు తాగేస్తున్నారట. పని సానుకూలం చేసుకురాకపోతే వారట్లా ప్రవర్తించరు. వారు తప్పకుండా సీతను చూసే వచ్చారు. అందుకు సమర్థుడైన హనుమంతుడు వాళ్ళవెంట ఉండనే ఉన్నాడు. పని ముగించుకు వచ్చిన పొగరు. లోనే వాళ్ళు కాపలా వాళ్ళను కూడా కొట్టారు,” అన్నాడు సుగ్రీవుడు.

సుగ్రీవుడు చేసిన ఊహ రామలక్ష్మణులకు పరమానందం కలిగించింది. సుగ్రీవుడు దధిముఖుడితో, “వానరులు మధు వనంలోని తేనె అంతా తాగినందుకు చాలా సంతోషించానని చెప్పు. వాళ్ళ కోసం నేనూ, రామలక్ష్మణులూ వేచి ఉన్నాం. వారిని త్వరగా రమ్మను,” అన్నాడు.

దధిముఖుడు వారు ముగ్గురికి ప్రణామం చేసి, శీఘ్ర గమనాన ఆకాశమార్గాన మధు వనానికి తిరిగివచ్చే సరికి వానరులకు కైపు దిగిపోయింది. అతను అంగదుడితో, ‘యువరాజా, మేము నిన్నడ్డగించామని కోపించకు. తెలియక పొరపాటు జరిగి పోయింది. నేను వెళ్ళి మీరు వచ్చినట్టు మీ పినతండ్రికి చెప్పగా, ఆయన సంతోషించి మిమ్మల్నందరినీ త్వరగా రమ్మన్నాడు,” అన్నాడు.

అంగదుడు తన వారితో, “మనం. ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాం గనక ఇక బయలుదేరుదాం. మనం వస్తున్న సంగతి రామలక్ష్మణులకు అప్పుడే తెలిసిపోయింది,” అన్నాడు.

అంగదుడూ, అతని వెనుకగా మిగిలిన వారూ ఆకాశంలోకి లేచారు. వారు కిష్కింధను చేరవస్తూ చేసిన సింహనాదాలు సుగ్రీవుడికి వినిపించాయి. అతను ఆనందంతో తోకచాచి ఆడించాడు. ఇంతలో వానరులు, హనుమంతుణ్ణి, అంగదుణ్ణి ముందుంచుకుని, రాముడున్న చోటికి వచ్చి వాలారు.

“వానరులారా, సీత ఎక్కడ ఉన్నది? నన్ను గురించి ఏ భావంతో ఉన్నది? అన్ని విషయాలు నాకు వివరంగా చెప్పండి” అని రాముడు వానరుల నడిగాడు. వానరులు హనుమంతుణ్ణి ముందుకు తోశారు.

హనుమంతుడు రాముడికి జరిగినదంతా చెప్పి, సీత ఇచ్చిన చూడామణిని రాముడి చేతిలో పెట్టి, “రామా, చిత్రకూటం మీద మీరుండేటప్పుడు కాకి ఉదంతం ఒకటి నీకు గుర్తుగా ఉండగలందులకు సీత చెప్పింది. తన కింకొక్క మాసమే గడువున్నదని నీతో చెప్పమన్నది. ఆమె చాలా అధైర్యం చెంది ఉన్నది. సముద్రం దాటి లంకకు వెళ్ళే ఉపాయం ఆలోచించండి,” అన్నాడు.

సీత పంపిన చూడామణిని చూడగానే రామలక్ష్మణులకు దుఃఖం ఆగలేదు. రాముడు శోకవివశుడై, “సీత కనిపించ కుండా ఈ చూడామణి కనిపించటం కన్న వేరే దుఃఖ మేముంటుంది? సీత ఇంక ఒక్క నెలపాటే జీవించి ఉంటుందా ? ఆమె ఉన్న చోటు తెలిసి అక్కడికి వెళ్ళకుండా, ఇక్కడ ఒక్క నిమిషమైనా ఎలా ఉండటం ? ఆ భయంకర రాక్షస స్త్రీలమధ్య సీత ఇంతకాలం ఎలా ఉన్నది?” అని ఆక్రోశించాడు.

అతను సీత అన్న మాటలన్నీ హను మంతుడి చేత చెప్పించుకుని విన్నాడు. హనుమంతుడు అంతా చెప్పి, ” ఆమె నిన్ను సేనతో వచ్చి రావణుణ్ణి చంపి తనను కాపాడమన్నది. అందుకు తగిన ప్రోత్సాహం నన్నే ఇవ్వమన్నది. వానర సేనలు సముద్రం దాటి లంకకు రాలేవేమో నని ఆమె సంశయించింది. తనకు విమో చనం ఉండదేమోనని భయపడుతున్న సీతను నేను అనేక రకాల ఓదార్చాను. నన్ను మించిన వారు సుగ్రీవుడి వద్ద వేలాది వానరులున్నారని చెప్పాను. త్వరలోనే రావణుడు మొదలైన వారు నాశనమైపోతారనీ, ఆమె తన భర్తతో అయోధ్యకు తిరిగి వెళుతుందనీ ధైర్యం చెప్పాను,” అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *