వాలీ సుగ్రీవుల మద్య వైరానికి కారణం

సుగ్రీవుడి మాటలు విని రాముడు “మీ ఇద్దరి మధ్యగల వైర కారణమేమిటో తెలుసుకోవాలని ఉన్నది. ఆ కారణమూ, మీ బలాబలాలూ తెలుసుకున్న మీదట నీకు సుఖం కలిగే మార్గం ఆలోచించ గలుగు తాను,” అన్నాడు.

దానికి సుగ్రీవుడిలా చెప్పాడు.

‘మా అన్న అయిన వాలిని నా తండ్రీ, నేనూ ఎంతో గౌరవంతో చూసే వాళ్ళం. మా తండ్రి పోయాక, పెద్దవాడు గనక వాలి రాజ్యానికి వచ్చాడు. నేను వాలికి సేవకుడు లాగా ఎంతో వినయ విధేయతలు చూపే వాణ్ణి. దుందుభి అనేవాడి పెద్ద కొడుకు మాయావి అనే రాక్షసుడు చాలా గొప్ప పరాక్రమశాలి. ఒక స్త్రీ విషయంలో మాయావికీ, వాలికి తగాదా వచ్చింది. ఒకనాటి అర్థరాత్రివేళ ఆ మాయావి కిష్కింధా ద్వారం వద్దకు వచ్చి, పెద్ద పెట్టున గర్జిస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి నిద్ర మేలుకొని మాయావి మదం అణచటానికి బయలుదేరాడు. నేనూ, ఆడ వాళ్ళూ ఎంత ఆపినా వాలి ఆగలేదు. అతను ఒంటరిగా పోతున్నాడే అని నేను కూడా వెంటవెళ్ళాను.

“మాయావి మా అన్నను చూస్తూనే భయపడి పారిపోసాగాడు. మేమతని వెంట పడ్డాం. ఇంతలో చంద్రోదయం కూడా అయింది. మాకూ తనకూ ఉండే దూరంక్రమంగా తగ్గుతూండటం చూసి మాయావి ఒక బిలంలో దూరాడు.

“వాలి ఆ బిలంలోకి వెళ్ళి మాయావిని చంపివస్తాననీ, తాను వచ్చేదాకా నన్ను బిలం వెలపల ఉండమనీ చెప్పాడు. నేను కూడా వస్తానంటే వినక, తన పాదాలమీద ప్రమాణం చేయించుకుని వాలి ఆ బిలం ప్రవేశించాడు.

“మా అన్న కోసం ఆ బిల ద్వారం వద్ద పూర్తిగా ఒక సంవత్సరం కాచుకుని ఉన్నాను. వాలి జాడలేదు. వాలి చనిపోయి ఉంటాడేమోనని నాకు భయమూ, అను మానమూ కలిగాయి. నా భయానికి తగ్గట్టుగా బిలం నుంచి నురుగుతో కూడిన ఎర్రని రక్తం రాసాగింది. లోపల నుంచి గర్జనలూ, ఆక్రందనలూ వినిపించాయి. ఆక్రందన ధ్వని వాలిదిలాగా నాకు తోచింది. ఈ లక్షణాలన్నీ గమనించి వాలి చని పోయాడనుకుని నాకు భయమూ, దుఃఖమూ కలిగాయి. నేను ఆ బిల ద్వారాన్ని పెద్ద కొండరాయితో మూసి, వాలికి జలతర్పణాలు విడిచి కిష్కింధకు తిరిగి వచ్చాను.

“వాలి మరణ వార్త నేనేమీ చెప్పకపోయినప్పటికీ మంత్రులు నా నుంచి రాబట్టి, తమలోతాము ఆలోచించుకుని నాకు పట్టాభిషేకం చేశారు. నేను రాజ్యపాలన చేస్తూండగా వాలి మాయావిని చంపేసి తిరిగి వచ్చాడు.

“నేను రాజు నయానని తెలిసి వాలి మండి పడ్డాడు. మంత్రులను బంధించాడు. నన్ను నానా మాటలూ అన్నాడు. నేను గౌరవంగా వాలికి నమస్కారం చేశాను. అతను నన్ను ఆశీర్వదించ లేదు. నా కిరీటం తీసి అతని పాదాల దగ్గిర పెట్టాను. కాని అతని కోపం చల్లారలేదు. అతన్ని రాజ్యం చెయ్యమని వేడుకున్నాను. బిలం దగ్గిర నేను చూసినదీ, విన్నదీ చెప్పాను. బిలానికి రాయి ఎందుకు అడ్డంగా పెట్టానో చెప్పాను.

నేను రాజ్యాభిషేకం కోరలేదనీ, రాజ్య క్షేమం కోరి మంత్రులే నాకు పట్టం గట్టారనీ అన్నాను. నీవు లేనప్పుడు రాజుగా పని చేశానుగాని, ఇప్పుడు నీకు యువరాజు నేనని కూడా చెప్పాను.

“వాలి ఇదేదీ లక్ష్యపెట్టాడుకాడు. తన కిష్టులైన మంత్రుల ముందు నన్ను నానా దుర్భాషలూ ఆడాడు. అతను బిలంలో ప్రవేశించాక ఒక ఏడాదిపాటు మాయావి కనిపించనే లేదట. తరవాత వాణ్ణి, వాడి బంధువుల నందరినీ చంపాడట. రక్తం ప్రవహించే నారంభించగానే దుర్గంధం భరించలేక బిల ద్వారం వద్దకు వచ్చి నన్ను పిలిచాడట. నేను తన కోసం వేచి ఉండక పోగా, తనను బిలంలో బంధించటానికి రాయి అడ్డు పెట్టానని వాలి తన మంత్రులతో అన్నాడు. ఇలా నాపై నింద మోపిన అనంతరం అతను నన్ను కట్టుబట్టతో కిష్కింధ నుండి వెళ్ళగొట్టేశాడు. నా భార్యను కాజేశాడు.

“ఈ విధంగా అన్న చేత వెళ్ళగొట్టబడి నేను ప్రపంచమంతా తిరిగాను. చిట్టచివరకు నాకీ ఋశ్యమూకం మీద నిలవనీడ దొరికింది. ఎందుకంటే ఒకానొక కారణం చేత వాలి ఈ పర్వతం పైన అడుగు పెట్టలేడు. నా వల్ల ఏ తప్పూ లేకపోయినప్పటికీ నేనిలా కష్టాల పాలయాను.

” ఇక వాలియొక్క శక్తి సామర్ధ్యాలు చెబుతాను. అతను సూర్యోదయానికి పూర్వమే నాలుగు దిక్కుల సముద్రాలూ సునాయాసంగా చుట్టి వస్తాడు. పర్వత శిఖరాలపై కెక్కి కొండరాళ్ళను బంతుల్లాగా ఎగరేసి పట్టుకుంటాడు. పెద్ద పెద్ద అడవి మానులను అవలీలగా విరిచెయ్యగలడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *