తెలివైన పంపకం
ఒక రైతుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు చురుకైనవాడు. రెండోవాడు కాస్త అమాయకుడు. రైతు చనిపోతూ పెద్దల ఎదుట తన కొడుకులతో, పెద్దవాడు మూడువేల గజాల చుట్టుకొలతగల భూమిని తాను తీసుకుని, మిగిలినది చిన్నవాడికి ఇవ్వాలని, ఈ పంపకం న్యాయాధికారి సమక్షంలో జరగాలని అన్నాడు.
తండ్రి పోయాక పెద్దవాడు వెళ్ళి పొలంచుట్టూ కొలిస్తే, అది మూడువేల గజాలే ఉన్నది. వాడు తమ్ముడితో, “పొలమంతా నాదే. నీకు ఏమీ రాదు,” అన్నాడు.
చిన్నవాడు ఈ మాట విని కంగారుపడి న్యాయాధికారి వద్దకు వెళ్ళి తన తండ్రి అన్నదీ, తన అన్న చెప్పినదీ చెప్పాడు.
న్యాయాధికారి ఆ అన్నదమ్ములను వెంటపెట్టుకుని వెళ్ళి పొలంచుట్టూ కొలిపించి, చుట్టుకొలత మూడువేల గజాలే ఉండటం గమనించాడు. తరవాత ఆయన ఆ భూమిని అడ్డంగానూ నిలువుగానూ విభజించి నాలుగు భాగాలు చేసి, ఒకదాని కొకటి ఎదురుగా ఉండే భాగాలు రెండు పెద్దవాణ్ణి ఎంచుకోమని, మిగిలిన రెండూ చిన్నవాడికి ఇచ్చేశాడు.

ఇద్దరి పొలాలూ మూడేసి వేల గజాల చుట్టుకొలత కలిగి ఉన్నాయి!
— దుమ్మూరి అశోక్కుమార్రెడ్డి